
'అప్పీళ్లను వేగంగా విచారించాలి'
ఇరు రాష్ట్రాల్లోని న్యాయస్థానాలు విధించిన జీవిత ఖైదును సవాలు చేస్తూ పలువురు ఖైదీలు హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేసుకున్నారని, అవి ఏళ్ల తరబడి విచారణకు నోచుకోకపోవడంతో వారు జైళ్లలోనే మగ్గా ల్సి వస్తోందని పౌర హక్కుల నేత, ఫ్రొఫెసర్ జి.హరగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
- హైకోర్టులో ప్రొఫెసర్ హరగోపాల్ పిల్
హైదరాబాద్: ఇరు రాష్ట్రాల్లోని న్యాయస్థానాలు విధించిన జీవిత ఖైదును సవాలు చేస్తూ పలువురు ఖైదీలు హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేసుకున్నారని, అవి ఏళ్ల తరబడి విచారణకు నోచుకోకపోవడంతో వారు జైళ్లలోనే మగ్గా ల్సి వస్తోందని పౌర హక్కుల నేత, ఫ్రొఫెసర్ జి.హరగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అప్పీళ్ల సత్వర విచారణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) ఆయన దాఖలు చేశారు. ఇందులో హైకోర్టు రిజిష్ట్రార్ జ్యుడీషియల్, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల హోంశాఖ ముఖ్య కార్యదర్శులు, ఇరు రాష్ట్రాల జైళ్ల శాఖల డీజీపీ, చర్లపల్లి కేంద్ర కారాగార సూపరింటెండెంట్లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. 2008 నుంచి 2014 వరకు 379 అప్పీళ్లు పెండింగ్లో ఉన్నాయని ఆయన వివరించారు.
వేగవంతమైన విచారణ రాజ్యాంగం ప్రసాదించిన హక్కని, ఈ విషయాన్ని సుప్రీం కోర్టు సైతం అనేక సందర్భాల్లో పలు తీర్పుల్లో స్పష్టం చేసిందని తెలిపారు. జీవిత ఖైదు పడిన ఖైదీలు దాఖలు చేసుకునే బెయిల్ పిటిషన్లను తిరస్కరించడం హైకోర్టులో ఆనవాయితీగా వస్తోందన్నారు. అప్పీళ్ల విచారణలో అసాధారణ జాప్యం జరిగినప్పుడు బెయిల్ మంజూరు చేసే విషయంలో ఎటువంటి మార్గదర్శకాలు లేవని, దీనివల్ల జీవిత ఖైదీల హక్కులకు భంగం వాటిల్లుతోందని వివరించారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని, జీవితఖైదు పడినవారు దాఖలు చేసుకున్న అప్పీళ్లను సత్వరమే విచారించేందుకు చర్యలు తీసుకునేలా ప్రతివాదులను ఆదేశించాలని హరగోపాల్ హైకోర్టును కోరారు. అప్పటివరకు జీవితఖైదు పడి, రెండేళ్ల జైలుశిక్ష పూర్తి చేసుకున్నవారికి బెయిల్ మంజూరు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని అభ్యర్థించారు. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకొచ్చే అవకాశాలున్నాయి.