ఖాళీలు భర్తీ చేస్తాం | Private doctors honored in the hall against the Deputy Chief Minister. | Sakshi
Sakshi News home page

ఖాళీలు భర్తీ చేస్తాం

Oct 30 2014 5:27 AM | Updated on Oct 9 2018 7:52 PM

ఖాళీలు భర్తీ చేస్తాం - Sakshi

ఖాళీలు భర్తీ చేస్తాం

మెడికల్ కళాశాలలో పోస్టుల భర్తీకి తక్షణమే చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.రాజయ్య హామీ ఇచ్చారు.

* ఆస్పత్రిని కళాశాలకు అనుసంధానిస్తాం
* రెండు, మూడు రోజులలోనే ఉత్తర్వులు
* దవాఖానాలో తగిన సౌకర్యాలన్నీ కల్పిస్తాం
* వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి టి.రాజయ్య
* వార్డులలో కలియదిరిగిన ఉప ముఖ్యమంత్రి
* రోగులతో మాటామంతీ, వైద్య సేవలపై ఆరా

నిజామాబాద్ అర్బన్ : మెడికల్ కళాశాలలో పోస్టుల భర్తీకి తక్షణమే చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.రాజయ్య హామీ ఇచ్చారు. బుధవారం ఉదయం ఆయన జిల్లా ఆసుపత్రి ఏడో అంతస్తులో ఏర్పాటు చేసిన బ్లడ్ సెల్స్ సెపరేటర్ యంత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కళాశాలలో పోస్టులు ఖాళీగా ఉం డడం తో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. వాటి భర్తీపై దృష్టిసారించామన్నారు. కళాశాలకు అత్యవసరంగా మరో మూడు ఎకరాల స్థలం అవసరమని ప్రిన్సిపాల్ జిజియాబాయి ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ఆయన కళాశాలకోసం మూడెకరాల స్థలం చూడాలని ఆర్‌డీఓ యాదిరెడ్డిని ఆదేశించారు. జిల్లా ఆసుపత్రిని మెడికల్ కళాశాలకు అనుసంధానిస్తూ రెండు, మూడు రోజులలో ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. కళాశాల, ఆసుపత్రిలో శానిటేషన్ సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందులు ఉన్నాయని ప్రిన్సిపాల్ పేర్కొనగా, ఆయా పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
 
ఆసుపత్రి పరిశీలన
బ్లడ్‌సెల్స్ సెపరేటర్‌ను ప్రారంభించిన అనంతరం ఉపముఖ్యమంత్రి ఆసుపత్రిలోని డయాలసిస్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. రోగిని పరీక్షించారు. చిన్నపిల్లల విభాగంలోకి వెళ్లి అత్యవసర వైద్యసేవలను పరిశీలించారు. రోగులకు నిత్యం అందుబాటులో ఉండాలని, సమయ పాలన పాటించాలని వైద్యాధికారులకు సూచించారు. మెడికల్ కళాశాలకు వెళ్లి అనాటమీ డిపార్ట్‌మెంట్‌ను, వ్యాయామశాలను పరిశీలించారు. మెడికల్ కళాశాల విద్యార్థులతో మాట్లాడి విద్యా బోధన గురించి తెలుసుకున్నారు. కళాశాలకు సంబంధించిన వివరాలను ప్రిన్సిపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. సదరం క్యాంప్‌ను సందర్శించి వికలాంగులతో మాట్లాడారు. వికలాంగులకు సర్టిఫికెట్లు సకాలంలో అందుతున్నాయో లేదో ఆరా తీశారు.
 
సన్మానం
ఐఎంఏ హాలులో ప్రైవేట్ వైద్యులు ఉప ముఖ్యమంత్రిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన రొమ్ము క్యాన్సర్‌పై అవగాహనకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకరావాలని ప్రైవేట్ వైద్యులకు సూచించారు. ఆయన వెంట ఎంపీ కవిత, జడ్‌పీ చైర్మన్ దఫేదార్ రాజు, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, మేయర్ ఆకుల సుజాత, ఎస్‌పీ చంద్రశేఖర్‌రెడ్డి, జడ్‌పీ సీఈఓ రాజారాం, ఆసుపత్రి సూపరింటెండెంట్ భీంసింగ్, ఆర్‌ఎంఓలు డా.విశాల్, బన్సీలాల్ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement