రాజ్‌భవన్‌కు ప్రజాకూటమి నేతలు | Prajakutami Leaders To Meet Governor Narasimhan In Raj Bhavan | Sakshi
Sakshi News home page

రాజ్‌భవన్‌కు ప్రజాకూటమి నేతలు

Dec 10 2018 3:41 PM | Updated on Dec 10 2018 4:44 PM

Prajakutami Leaders To Meet Governor Narasimhan In Raj Bhavan - Sakshi

కూటమి భాగస్వామ్య పక్షాలను ఒకే పార్టీగా పరిగణించాలని గవర్నర్‌కు విఙ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌ : ఉత్కంఠ రేపుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీ నేతల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాల ఆధారంగా తమదే అధికారం అని టీఆర్‌ఎస్‌, ప్రజాకూటమి నేతలు పోటాపోటీ ప్రకటనలు చేస్తున్నప్పటికీ హంగ్‌ ఏర్పడే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరుపక్షాలు తెరవెనుక మంతనాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీర్‌ఎస్‌కు మద్దతునిస్తామని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ప్రకటించడంతో ప్రజాకూటమి నేతలు అప్రమత్తమయ్యారు. సోమవారం గవర్నర్‌ను కలిసేందుకు రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సహా జానారెడ్డి, చాడ వెంకట్‌ రెడ్డి, కోదండరాం, షబ్బీర్‌ అలీ, పొన్నాల లక్ష్మయ్య తదితరులు గవర్నర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.

మాకే అవకాశం ఇవ్వాలి..
అత్యధిక స్థానాల్లో గెలిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు తమకే అవకాశం ఇవ్వాలని ప్రజాకూటమి నేతలు గవర్నర్‌ నరసింహన్‌ను కోరారు. కూటమి భాగస్వామ్య పక్షాలను ఒకే పార్టీగా పరిగణించాలని గవర్నర్‌కు విఙ్ఞప్తి చేశారు. ఈ మేరకు కూటమి నేతలు గవర్నన్‌కు వినతి పత్రం అందజేశారు. ఎన్నికలకు ముందే కూటమిగా ఏర్పడ్డామని కాంగ్రెస్‌, టీజేఎస్‌, సీపీఐ, టీడీపీ నేతలు పేర్కొన్నారు. అన్ని పార్టీలు కలిసి కామన్‌ మినిమ్‌ ప్రోగ్రామ్‌ ఇచ్చామని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కూటమి కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఓట్ల గల్లంతుపై ఈసీకి ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement