కేరళ అసెంబ్లీలో బీజేపీ వర్సెస్‌ సతీశన్‌-విజయన్‌! | Kerala Assembly Vande Mataram Row: BJP vs Vijayan-Satheesan | Sakshi
Sakshi News home page

కేరళ అసెంబ్లీలో బీజేపీ వర్సెస్‌ సతీశన్‌-విజయన్‌!

May 29 2026 1:57 PM | Updated on May 29 2026 2:14 PM

Kerala Assembly Vande Mataram Row: BJP vs Vijayan-Satheesan

కేరళ రాజకీయాల్లో మరోసారి “వందేమాతరం” వివాదం చెలరేగింది. కొత్త అసెంబ్లీ సమావేశాల తొలి రోజే జాతీయ గీతం ఆలాపన చుట్టూ మొదలైన వివాదం రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించింది. గవర్నర్ సమక్షంలో పూర్తి “వందేమాతరం” వినిపించాల్సిన కేంద్ర మార్గదర్శకాలను పాటించలేదంటూ బీజేపీ మండిపడుతుండగా.. ఇది ఎన్నాళ్లుగానో కొనసాగుతున్న సంప్రదాయమేనని ప్రభుత్వం సమర్థించుకోవడం, దానికి ప్రధాన ప్రతిపక్షం మద్దతు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

తిరువనంతపురంలోని అసెంబ్లీలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ ప్రసంగానికి ముందు “వందేమాతరం”లో తొలి రెండు చరణాలనే ఆలపించారు. అయితే 2026 ఫిబ్రవరిలో కేంద్ర హోంశాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. గవర్నర్ హాజరయ్యే కార్యక్రమాల్లో పూర్తి ఆరు చరణాలు వినిపించాలని సూచించిందని తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారంపై గవర్నర్ అసెంబ్లీ స్పీకర్ ఏఎన్‌ షమ్షీర్‌ దృష్టికి ప్రోటోకాల్ అంశాన్ని తీసుకెళ్లారు.

అయితే ఈ వ్యవహారంపై కేరళ ప్రభుత్వం మాత్రం ఇది కొత్త విషయం కాదని స్పష్టం చేసింది. అసెంబ్లీలో గతం నుంచే “వందేమాతరం”లో తొలి రెండు చరణాలనే ఆలపిస్తున్న సంప్రదాయం కొనసాగుతోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత పినరయి విజయన్‌ కూడా ప్రభుత్వ వైఖరినే సమర్థించారు. పూర్తి “వందేమాతరం” ఆలాపన తప్పనిసరి కాదని, 2026 మార్చిలో సుప్రీం కోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందన్నారు. దీంతో ఇది కేవలం ప్రోటోకాల్ వివాదమా? లేక రాజకీయ సంకేతమా? అన్న చర్చ మొదలైంది.

ఇక బీజేపీ నేతలు మాత్రం తీవ్రంగా మండిపడుతున్నారు. “వందేమాతరం”కు 150 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో ఇలా చేయడం జాతీయ గీతానికే అవమానమని విమర్శించారు. గవర్నర్‌ను, లోక్‌భవన్‌ను, జాతీయ వారసత్వాన్ని కూడా అవమానించినట్లేనని ఆరోపించారు. అంతేకాదు.. ప్రభుత్వం జమాత్-ఏ-ఇస్లామీ, సీపీఎం అభిప్రాయాలకు తలొగ్గుతోందంటూ ఆరోపణలు గుప్పించారు.

మరోవైపు కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ వివాదం తలెత్తడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో యూడీఎఫ్ 102 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ్టి అసెంబ్లీలో “వందేమాతరం” ఆలాపన కూడా చారిత్రక పరిణామమేనని కొందరు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే.. 1957 తర్వాత ఇలాంటి పరిస్థితి ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. “వందేమాతరం”లో ఎన్ని చరణాలు పాడాలి అనే అంశం ఇప్పుడు కేరళలో రాజకీయ, సాంస్కృతిక, రాజ్యాంగ చర్చకు దారితీసింది.

Advertisement
 
Advertisement
Advertisement