కదిలింద దండు!

Pragathi Nivedana Sabha Karimnagar - Sakshi

టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రగతి నివేదన సభకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాల నుంచి గులాబీదండు కదిలింది. కొంగరకలాన్‌ సభ సక్సెస్‌ కోసం వారం రోజులుగా కసరత్తు చేస్తున్న నాయకులు.. ఎట్టకేలకు భారీ సంఖ్యలో జనాన్ని తరలించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా 13 నియోజకవర్గాల నుంచి 2.50 లక్షలమంది తరలింపు లక్ష్యం కాగా.. 1.60 లక్షల వరకు తరలినట్లు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 13 నియోజకవర్గాల నుంచి జన సమీకరణ, తరలింపునకు బాధ్యులు సర్వశక్తులొడ్డారు. ప్రగతి నివేదన సభకు ముహూర్తం ఖరారైన మరుసటిరోజు నుంచే ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ జన సమీకరణ, తరలింపుపై ఉమ్మడి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలతో హైదరాబాద్, కరీంనగర్‌లో పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించారు. 13 నియోజకవర్గాలకు సీనియర్‌ నాయకులు, ప్రజాప్రతినిధులను ఇన్‌చార్జిలుగా నియమించి కరీంనగర్‌ సత్తా చూపేలా అందరూ కలిసి జనం తరలింపులో నిమగ్నమయ్యారు. ఈ మేరకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి భారీగా జనాన్ని తరలించడంలో సఫలీకృతులయ్యారు.
 

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రాజీవ్‌ రహదారి గులాబీమయమైంది. ఎటూ చూసినా గులాబీ జెండాల రెపరెపలే. ఏ రోడ్డు చూసినా టీఆర్‌ఎస్‌ జెండాలతో కదిలే వాహనాలే. ఆర్టీసీ బస్సులు మొదలు కార్లు, ప్రైవేటు బస్సులు, ట్రాక్టర్లు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, అభిమానులతోనే కిక్కిరిసిపోయాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పెద్దపల్లి, మంథని, రామగుండం, చొప్పదండి, మానకొండూరు, ధర్మపురి, హుస్నాబాద్, కరీంనగర్‌ తదితర నియోజకవర్గాలకు చెందిన వాహనాలన్నీ కూడా కరీంనగర్‌–హైదరాబాద్‌ రాజీవ్‌రహదారి మీదుగానే వెళ్లడంతో రోడ్డంతా రద్దీగా మారింది. రేణికుంట టోల్‌ప్లాజా వద్ద ప్రతి 10 నిముషాలకోసారి ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలకు చెందిన చాలా వాహనాల ఎన్‌హెచ్‌–44 నెంబర్‌ జాతీయ రహదారి మీదుగా వెళ్లాయి.

సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కామారెడ్డి, సిద్దిపేట మీదుగా సభాస్థలికి చేరుకున్నారు. హుజూరా బాద్‌ నియోజకవర్గం వాహనాలు వయా వరంగల్, హుస్నాబాద్‌ నుంచి వెళ్లాయి. దీంతో హైదరాబాద్‌ను కలిపే రోడ్లపై ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గులాబీ జెండాలతో నిర్విరామంగా సాగిన వాహనాల శ్రేణితో రహదారులన్నీ గులాబీమయం అయ్యాయి. కొంగరకలాన్‌లో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ‘ప్రగతి నివేదన’ బహిరంగసభ సక్సెస్‌ కావడంతో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. ‘ముందస్తు’ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో నిర్వహించిన సభకు జిల్లానుంచి పోటీపోటీగా జనాన్ని తరలించగా.. లక్షలాదిగా తరలివచ్చిన ప్రజానీకాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ప్రసంగం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను ఉర్రూతలూగించింది.

హుషారెత్తించిన కేసీఆర్‌ ప్రసంగం.. కరీంనగర్‌ ప్రస్తావనతోనే మొదలు
గులాబీ దళపతి, సీఎం కేసీఆర్‌ చేసిన ప్రసంగం టీఆర్‌ఎస్‌ శ్రేణులను హుషారెత్తించింది. కరీంనగర్‌ జిల్లా తెలంగాణ ఉద్యమానికి, తనకు సెంటిమెంటని పదేపదే చెప్పే ఆయన.. కొంగరకలాన్‌ సభలో కరీంనగర్‌ ప్రస్తావనతోనే ప్రసంగం మొదలెట్టారు. సమైక్యాంధ్రుల పాలనలో కరువు, విద్యుత్‌ సమస్యలతోపాటు ఆనాడు జరిగిన అన్యాయాలను ఎంపీ వినోద్‌కుమార్, దేశిని చిన్నమల్లయ్యతో కలిసి తిరిగి పంచుకున్నానని ప్రస్తావించారు. ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ, జరిగిన అభివృద్ధిని సీఎం వివరించి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. వచ్చే ఎన్నికల్లో జరిగిన అభివృద్ఢిని చూసి టీఆర్‌ఎస్‌కు ఓటేయమని చెప్పిన కేసీఆర్‌.. కాంగ్రెస్, ఇతర పక్షాలకు ఓటేయడానికి ఉన్న కారణాలను కూడా ప్రశ్నించి ప్రజలను ఆలోచనలో పడేశారు. ఈ నేపథ్యంలో సభకు వెళ్లిన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ప్రజలతోపాటు టీ వీలకు అతుక్కుపోయిన జనం సైతం సభ జరిగిన తీరుపై విస్తృతంగా చర్చించుకున్నారు.

ఉమ్మడి కరీంనగర్‌ నుంచి 1.60 లక్షల పైనే.. ఇంటిలిజెన్స్, స్పెషల్‌బ్రాంచీల ఆరా
కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లోని 13 నియోజకవర్గాల నుంచి 2.50 లక్షల మంది జనాన్ని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రతి నియోజకవర్గం నుంచి 20 వేల మందిని లక్ష్యంగా చేసుకుని జన సమీకరణ జరపాలని మండల, గ్రామ యంత్రాంగానికి ఆదేశాలు పంపారు. కాగా 13 నియోజకవర్గాలనుంచి భారీగా తరలించేందుకు కసరత్తు చేసినా.. వాహనాలు సరిపోక.. సమయానికి గ్రామాలకు చేర్చలేకపోవడం వల్ల చాలామంది ఆగిపోయారు. దీంతో ఉమ్మడి కరీంనగర్‌ నుంచి 5,743 ఆర్టీసీ, ప్రైవేట్, స్కూల్‌ బస్సులు, కార్లు, వ్యాన్లు, జీపులు, ట్రాక్టర్లు తదితర వాహనాల్లో 1.60 లక్షల మందిని తరలినట్లు అంచనా. ఆయా నియోజకవర్గాల నుంచి వెళ్లిన వాహనాల ఆధారంగా అధికారులు, నిఘావర్గాల అంచనా మేరకు కరీంనగర్‌ జిల్లా 60 వేల వరకు వెళ్లినట్లు చెప్తున్నారు.

హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచి 23 వేలు, కరీంనగర్‌ నుంచి 15 వేలు, మానకొండూరు 13, చొప్పదండి నుంచి తొమ్మిది వేల వరకు వెళ్లినట్లు అంచనా. జగిత్యాల జిల్లా నుంచి 1343 వాహనాల్లో 41 వేలు, రాజన్నసిరిసిల్ల జిల్లా నుంచి 650 వాహనాల్లో 25 వేలు, పెద్దపల్లి జిల్లా నుంచి 950 వాహనాల్లో 30 వేలవరకు వెళ్లినట్లు అంచనా వేశారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి జన సమీకరణ చేసేందుకు మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు, సభ కోసం నియమించిన ఇన్‌చార్జిలు, ఇతర ప్రజాప్రతినిధులు పోటీపడ్డారు. మంత్రి ఈటల రాజేందర్‌ తన నియోజకవర్గం హుజూరాబాద్‌ నుంచి భారీగా జన సమీకరణ చేశారు. మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో రాజన్న సిరిసిల్ల నుంచి ద్వితీయ శ్రేణి నాయకత్వం జనాన్ని తరలించింది. కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ సొంత డబ్బులు కూడా వెచ్చించారు. ధర్మపురి, కోరుట్ల, పెద్దపల్లి, మానకొండూరు, హుస్నాబాద్‌ ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, కె.విద్యాసాగర్, దాసరి మనోహర్‌రెడ్డి, రసమయి బాలకిషన్, వొడితెల సతీష్‌కుమార్‌ జనసమీకరణకు పాటుపడ్డారు.

జగిత్యాల ఇన్‌చార్జి డాక్టర్‌ సంజయ్‌కుమార్, చొప్పదండి, రామగుండం ఎమ్మెల్యేలు బొడిగ శోభ, సోమారపు సత్యనారాయణతోపాటు ఆయా నియోజకవర్గాల్లో టికెట్లు ఆశిస్తున్న నేతలు కూడా జన సమీకరణలో పాలు పంచుకున్నారు. ఎంపీ వినోద్‌కుమార్, జెడ్పీ చైర్మన్‌ తుల ఉమ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఐడీసీ, సుడా చైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డి, జీవీ.రామకృష్ణారావు, పార్టీ సీనియర్‌ నాయకులు, ఇన్‌చార్జిలు భాగస్వామ్యం అయ్యారు. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, రైతు సమన్వయ సమితి నాయకులు, జిల్లా, మండల పరిషత్‌ అధ్యక్షులు, సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సొంత కార్లలో హైదరాబాద్‌కు తరలివెళ్లారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 13 నియోజకవర్గాల నుంచి కొంగరకలాన్‌ సభ కోసం ఎంత మంది తరలారు? ఏయే నియోజకవర్గాల నుంచి ఎన్ని వాహనాలు, ఎంతమంది? జన సమీకరణలో ఏయే నాయకుల ప్రమేయం ఎంత? తదితర అంశాలపై నిఘా వర్గాలు ఆరా తీశాయి.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top