చెరువు కన్నతల్లిలాంటిది | pond is like a mother | Sakshi
Sakshi News home page

చెరువు కన్నతల్లిలాంటిది

May 17 2015 12:08 AM | Updated on Sep 17 2018 8:02 PM

చెరువు కన్న తల్లిలాంటిదని, వాటిని పునరుద్ధరించుకుంటే భూగర్భజలాలు పెరుగుతాయని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

చేవెళ్లలో పుష్కరిణి పనుల ప్రారంభోత్సవ సభలో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
సుందరీకరణ, పునరుద్ధరణ
పనులను దత్తత తీసుకున్న పోలీసుశాఖ
 

 చేవెళ్ల : చెరువు కన్న తల్లిలాంటిదని, వాటిని పునరుద్ధరించుకుంటే భూగర్భజలాలు పెరుగుతాయని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. చేవెళ్లలో పుష్కరిణి పనులను శనివారం ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ మత్స్యకారులు చేపలను పెంచుకోవచ్చని, వ్యవసాయదారులు సాగునీటికి వాడుకోవచ్చునన్నారు. చేవెళ్లలోని పురాతన శ్రీవెంకటేశ్వర దేవాలయ పునరుద్ధరణ, అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి రూ.50 లక్షలు మంజూరు చేయించడానికి కృషిచేస్తానని చెప్పారు. పోలీసులు గుండం అభివృద్ధిని దత్తత తీసుకోవడాన్ని ఆయన అభినందించారు.

రాష్ట్ర రవాణామంత్రి పి.మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ 46 వేల చెరువులను గుర్తించగా, వీటిలో మొదటి విడతగా 10 వేల చెరువులను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో 2,800 చెరువులకు ఈసంవత్సరం 558 చెరువులను పునరుద్ధరిస్తున్నామన్నారు. గత ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు చెరువుల పునరుద్ధరణను పూర్తిగా విస్మరించాయని ఆరోపించారు. రానున్న రోజుల్లో పగలే వ్యవసాయానికి 9 గంటల విద్యుత్‌ను అందిస్తామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలలో పోలీసులు భాగస్వాములు కావడం అభినందనీయమాన్నారు.

డీఐజీ గంగాధర్, ఎస్పీ ఎం.శ్రీనివాసులు మాట్లాడుతూ శాంతిభద్రతలతో పాటుగా సీఎం కేసీఆర్ పిలుపుమేరకు స్వచ్ఛభారత్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నామని చెప్పారు. ముందుగా స్థానిక వెంకటేశ్వర దేవాలయంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే కాలె యాదయ్యకు జన్మదిన సందర్భంగా వేదికపైనే మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి కేక్‌ను కట్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీలు పి.నరేందర్‌రెడ్డి, యాదవరెడ్డి, డీఎస్పీ ఏవీ.రంగారెడ్డి, ఆర్డీఓ చంద్రమోహన్, సీఐ ఉపేందర్, ఎస్‌ఐలు రాజశేఖర్, ఖలీల్, ఎంపీపీ ఎం.బాల్‌రాజ్, జెడ్పీటీసీ సభ్యురాలు చింపుల శైలజ, సర్పంచ్ నాగమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు పద్మ, వైస్ ఎంపీపీ పి.వెంకట్‌రెడ్డి, వార్డుసభ్యురాలు అంతమ్మ, మాణిక్‌రెడ్డి, బర్కల రాంరెడ్డి, రామేశ్వర్‌రెడ్డి, ఎం.యాదగిరి, నీటి పారుదల అధికారులు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement