
వారికి ఫిదా అవుతున్న ప్రజలు..!
18 ఏళ్లుగా ఓ నకిలీ బాబా కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని ప్రజల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకున్నాడు.
► అమాయక ప్రజలే టార్గెట్
► పూజలు చేçస్తూ పట్టుబడ్డ వైనం
► 56 విగ్రహాలు స్వాధీనం
► నకిలీ బాబాలను పట్టుకుంటాం: సీపీ కమలాసన్రెడ్డి
కరీంనగర్: 18 ఏళ్లుగా ఓ నకిలీ బాబా కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని ప్రజల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకున్నాడు. వాస్తు, గుప్తనిధులు, సంతానం కల్గించడం, ఉద్యోగ, వివాహ ప్రాప్తి, పంటల దిగుబడి ఎక్కువగా తెప్పించడం, అప్పులు రాబట్టడానికి పూజలు చేస్తానని నమ్మించేవాడు. ఇలా మోసం చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న నెల్లూరు జిల్లాకు చెందిన నకిలీ స్వామిని టాస్క్ఫోర్స్, కరీంనగర్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. కరీంనగర్ కమిషనరేట్లోని హెడ్ క్వార్టర్లో గురువారం సీపీ కమలాసన్రెడ్డి వివరాలు వెల్లడించారు.
నేరం చేసే విధానం
ఆంధ్రప్రదేశ్లోని నెల్లూర్ జిల్లాకేంద్రానికి చెందిన పిడదల వెంటకస్వామి(60) 23 ఏళ్ల క్రితం తమిళనాడులో వాస్తు, దోషనివారణ, బోరు వేయడానికి పూజలు చేయడం నేర్చుకున్నాడు. అక్కడినుంచి 18 ఏళ్ల క్రితం ప్రస్తుతం జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి, గొల్లపల్లి మండలాల్లో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడి అమాయక ప్రజలను వివిధ రుగ్మతల నివారణ పేరిట పూజలు చేస్తానని నమ్మించి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేయడం ప్రారంభించాడు.
ఇదేం మోసం
ఉన్న సమస్యలు చాలవన్నట్లుగా కొత్త సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు అమాయక ప్రజలు. నకిలీ బాబాల లీలలకు ఫిదా అవుతూ ఇల్లు గుల్లా చేసుకుంటున్నారు. ఈ నకిలీ బాబాలు అందినకాడికి డబ్బులు దండుకుంటూ కనిపించకుండా పోతున్నారు. పాపం.. ఈ బాబాలను నమ్మినవారు చివరికి బాధితులుగా మారిపోతున్నారు.
పట్టుబడిన తీరు
గంగాధర మండలం ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన జిట్టవేని శ్రీనివాస్ అనే వ్యక్తి కుటుంబసభ్యులకు ఆరోగ్యం బాగా లేదని, తండ్రి మద్యం మానడం లేదని ఇబ్బందులు పడుతున్నాడు. ఈ సమయంలో నకిలీ బాబాను ఆశ్రయించాడు. వెంకటస్వామి పలు పూజలు చేయాలని నమ్మించి అతడి వద్ద నుంచి రూ.30వేలు వసూలు చేశాడు. వారి పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో బాధితుడు కరీంనగర్ టాస్క్ఫోర్స్ బృందం, కరీంనగర్ రూరల్ పోలీసులను ఆశ్రయించాడు. పూజలు చేస్తుండగా పట్టుకున్నారు. అరెస్టు చేసి 56 ప్రతిమలు, ఉంగరాలు, తాయత్తులు, చెట్టు వేర్లు. ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
బాధితులు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావాలి. వెంకటస్వామిపై పీడీ యాక్ట్ అమలు చేయనున్నాం. ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేస్తాం. బాబాల పేరుతో మోసం చేస్తున్నారనే సమాచారముంది. త్వరలో వారిపై దాడులు చేస్తాం. – సీపీ కమలాసన్రెడ్డి