పట్టణ ప్రగతిలో అపశ్రుతి! | Pattana Pragati Program Wall Collapsed Child Dies In Warangal | Sakshi
Sakshi News home page

పట్టణ ప్రగతిలో అపశ్రుతి.. చిన్నారి మృతి!

Mar 1 2020 1:34 PM | Updated on Mar 1 2020 4:55 PM

Pattana Pragati Program Wall Collapsed Child Dies In Warangal - Sakshi

ప్రొక్లెయినర్‌తో మురుగు కాలువ పనులు చేస్తుండగా గోడ కూలి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోగా ఆమె తమ్ముడికి తీవ్ర గాయాలయ్యాయి.

సాక్షి, వరంగల్‌ అర్బన్‌: పట్టణాల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రొక్లెయినర్‌తో మురుగు కాలువ పనులు చేస్తుండగా గోడ కూలి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోగా ఆమె తమ్ముడికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. నగరంలోని 43వ డివిజన్‌లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆదివారం పనులు కొనసాగుతున్నాయి. మురుగు కాలువను జేసీబీతో శుభ్రం చేస్తుండగా ఆ పక్కనే గోడకు తగలడంతో అది కూలిపోయింది. అదే సమయంలో ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులపై గోడ కూలింది.

ఈ ప్రమాదంలో ప్రిన్సి అనే ఎనిమిది సంవత్సరాల బాలిక మృతి చెందింది. ఆమె తమ్ముడికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిది గోవిందరావుపేట మండల కేంద్రం. మృతురాలి తండ్రి వడ్రంగి పనిచేస్తూ కుంటుంబాన్ని పోషిస్తున్నాడు. జేసీబీ డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని చిన్నారుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలుడిని చికిత్స నిమిత్తం ఏజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌​ భాస్కర్‌, జిల్లా కలెక్టర్‌ ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధితులను ఆదుకుంటామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement