సర్పంచ్‌ల గౌరవ వేతన బకాయిలకు మోక్షం | Panchayati Raj Commissioner orders on Sarpanch's salaries | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌ల గౌరవ వేతన బకాయిలకు మోక్షం

Jan 10 2017 2:05 AM | Updated on Sep 5 2017 12:49 AM

గ్రామ పంచాయతీలకు అందాల్సిన గౌరవ వేతన బకాయిలకు ఎట్ట కేలకు మోక్షం లభించింది

రూ. 26.08 కోట్లు విడుదల చేస్తూ పంచాయతీరాజ్‌ కమిషనర్‌ ఉత్తర్వులు

సాక్షి, హైదరాబాద్‌: గ్రామ పంచాయతీలకు అందాల్సిన గౌరవ వేతన బకాయిలకు ఎట్ట కేలకు మోక్షం లభించింది. 2015 అక్టోబరు నుంచి 2016 మార్చి వరకు ఆరునెలల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని సర్పం చులు పెద్దెత్తున ఆందోళన చేసిన నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. ఇటీవల సర్పంచ్‌ల సంఘాలను పిలిపించుకొని వారి సమస్యలపై పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టమైన హామీలను కూడా ఇచ్చారు. మంత్రి ఆదేశాల మేరకు పాత వేతన బకాయిల నిమిత్తం రూ.26.08 కోట్లు విడుదల చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ నీతూ కుమారి ప్రసాద్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ట్రెజరీల నుంచి సర్పంచులు తమ వేతనాలను తీసుకునేందుకు వీలుగా చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల పంచాయతీ అధి కారులను కమిషనర్‌ నీతూకుమారి ప్రసాద్‌ ఆదేశించారు. ప్రతినెలా గౌరవవేతనం చెల్లింపు వివరాలను కమిషనర్‌ ఆఫీసుకు విధిగా పంపాలని డీపీవోలకు సూచించారు.

చెక్కులపై ఈవోపీఆర్డీ సంతకం ఇకపై అక్కర్లేదు!
రెండేళ్లుగా ప్రభుత్వానికి సర్పంచులకు మధ్య నలుగుతున్న చెక్‌ పవర్‌ వివాదం ఎట్టకేలకు కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. గ్రామ పంచాయతీలకు సంబంధించిన అభివృద్ధి నిధుల వినియోగంలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శితో పాటుగా ఈవో పీఆర్డీ (ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పంచాయతీ రాజ్, రూరల్‌ డెవలప్‌మెంట్‌)కు కూడా కౌంటర్‌ సిగ్నేచర్‌ అధికారాన్ని కల్పిస్తూ 2015 జూన్‌లో ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అయితే.. ప్రజలే నేరుగా ఎన్నుకున్న తమను ప్రభుత్వం దొంగలుగా చూస్తోందని, తమపై నమ్మకం లేకనే బిల్లులపై ఈవోపీఆర్డీ కౌంటర్‌ సిగ్నేచర్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసిందని  సర్పంచులు ఆరోపిస్తున్నారు. 

ఈ విషయమై  సర్పంచుల నుంచి రోజురోజుకూ ఆందోళన తీవ్రమవుతుండటంతో ప్రభుత్వం పాత విధానాన్నే అవలంభించాలని నిర్ణయించినట్లు తెలిసింది.  మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ విషయమై సానుకూలంగా స్పందిం చడంతో ఈ వివాదం తాజాగా కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. పంచా యతీల బిల్లులపై ఈవోపీఆర్డీ కౌంటర్‌ సిగ్నేచర్‌ పద్ధతిని రద్దు చేస్తూ నేడో, రేపో ఉత్తర్వులు కూడా జారీ అవనున్నాయని తెలంగాణ సర్పంచుల సంఘం కన్వీనర్‌ ఎం.పురుషోత్తం రెడ్డి సోమవారం సాక్షికి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement