
'ఓర్వలేకనే నాపై ఆరోపణలు'
మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో తనకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే కొందరు తప్పుడు ఆరోపణలు, ఫిర్యాదులు చేస్తున్నారని మాజీ మంత్రి పి.శంకర్రావు అన్నారు.
షాద్నగర్: మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో తనకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే కొందరు తప్పుడు ఆరోపణలు, ఫిర్యాదులు చేస్తున్నారని మాజీ మంత్రి పి.శంకర్రావు అన్నారు. గురువారం పట్టణంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంతో తనకు ఎనలేని అనుబంధం ఉందని, అందుకే తరుచుగా అక్కడికి వస్తున్నట్టు చెప్పారు.
సీఎం క్యాంపు కార్యాలయం ముందు నాగులపల్లి గ్రామానికి చెందిన మహిళ చేసిన రాద్దాంతం గురించి సీఎం, డీజీపీ, రెవెన్యూ కమిషనర్, జిల్లా ఎస్పీ, స్థానిక సీఐకు ఫిర్యాదు చేశానన్నారు. భూములను కబ్జా పెట్టానని తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని, వాటిని కొనుగోలు చేసి రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేసుకున్నానని.. అందుకు సంబంధించిన ప్రతులను మీడియాకు అందచేశారు. తన దగ్గర డబ్బులు తీసుకొని కూడా కొందరు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేస్తే సీబీఐతో విచారణ చేయించాలని సవాల్ విసిరారు.