ఉద్యోగ సాధనకు ‘వారధి’ యువతకు బంగారు భవిష్యత్ | on the frist day of adoption of the 1000 admissions | Sakshi
Sakshi News home page

ఉద్యోగ సాధనకు ‘వారధి’ యువతకు బంగారు భవిష్యత్

Apr 16 2015 4:46 AM | Updated on Aug 9 2018 8:51 PM

రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు కృషి..

- రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు కృషి
- అవగాహన సదస్సులో ఎంపీ వినోద్‌కుమార్
- మొదటి రోజు 1000 మంది దరఖాస్తుల స్వీకరణ

ముకరంపుర: ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో యువతకు బంగారు భవిష్యత్ ఉందని కరీంనగర్  ఎంపీ బి.వినోద్‌కుమార్ అన్నారు. జిల్లా యంత్రాంగం తరపున కలెక్టర్ చైర్మన్‌గా ఉన్న వారధి స్వచ్ఛంద సంస్థ కార్యాలయాన్ని ఎంపీ బుధవారం కలెక్టరేట్‌లో ప్రారంభించారు. అనంతరం ఆడిటోరియంలో నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు జిల్లా కేంద్రంలో వారధి సంస్థ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో విస్తృత అవకాశాలున్నాయని, వాటిని అందిపుచ్చుకోవడంలో యువత వెనుకంజలో ఉండడం విచారకరమన్నారు. ఇప్పటివరకుఎన్‌డీఏ (నేషనల్ డిఫెన్స్ అకాడమీ) పరీక్షను ఎవరూ రాయలేదని పేర్కొనడంతో విచారం వ్యక్తం చేశారు. బ్యాంకింగ్ సెక్టార్‌లోనూ ఆంధ్రావారికే ఉద్యోగాలున్నాయని, రానున్న 15 ఏళ్లలో రెండు రాష్ట్రాల్లోనూ సీమాంధ్ర ఐఏఎస్‌లు ఉండే అవకాశముందని పేర్కొన్నారు.

తెలంగాణ యువత వచ్చే నాలుగేళ్లలో కనీసం 20 మంది ఐఏఎస్‌లు కావాలని ఆకాంక్షించారు. ఉద్యోగ సాధనకు పునాది లాంటి వారధి సంస్థ పనితీరును పరిశీలించి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు కృషి చేస్తానన్నారు. కలెక్టర్ నీతూప్రసాద్ మాట్లాడుతూ ఔట్ సోర్సింగ్‌తోపాటు అన్ని రకాల ఉద్యోగాలను వారధి సంస్థ ద్వారా భర్తీ చేస్తామన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకున్న యువత కలలు నెరవేరుతాయన్నారు. నగర మేయర్ రవీందర్‌సింగ్ మాట్లాడుతూ యువత కష్టపడితే సాధించలేని లేదని అన్నారు. ఎస్పీ శివకుమార్ మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో తమ శక్తి సామర్థ్యాల మేరకు లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకు పోవాలన్నారు. ర్యాంకులు ముఖ్యం కాదని విషయ పరిజ్ఞానం అవసరమని సూచించారు. కార్యక్రమంలో ఏజేసీ నాగేంద్ర, డీఆర్డీఏ పీడీ అరుణశ్రీ, ఆర్డీవో చంద్రశేఖర్ జిల్లా అధికారులు పాల్గొన్నారు.

కిక్కిరిసిన కలెక్టరేట్
అవగాహన సదస్సుకు జిల్లా నలుమూలలనుంచి పెద్ద ఎత్తున నిరుద్యోగులు తరలిరావడంతో కలెక్టరేట్ కిక్కిరిసిపోయింది. 2 వేల మంది వరకు రావడంతో ఆడిటోరియం సరిపోక అవస్థలు పడ్డారు. చంటిపిల్లలతో వచ్చిన మహిళలు ఇక్కట్లకు గురయ్యారు. స్థలం లేక కొందరు బయటే ఉండి విన్నారు. ఆడిటోరియంలో వేడి భరించలేక, కుర్చీలు లేక చాలా మంది వెనుదిరిగారు. ఈ విషయమై కలెక్టర్ స్పందిస్తూ ఊహించినంతకంటే ఎక్కువ రావడంతో ఇబ్బందిని గమనించామని, మరోసారి అందరికీ సౌకర్యంగా ఉండే చోట సదస్సు నిర్వహిస్తామని, మిగతావారు వారధి కార్యాలయంలో సంప్రదించి దరఖాస్తులు తీసుకోవాలని సూచించారు. బుధవారం కేవలం వెయ్యి దరఖాస్తులు మాత్రమే ఇచ్చారు.

అండగా ‘వారధి’
జిల్లా యువతకు వారధి సొసైటీ అండగా ఉంటుందని వారధి( నాలెడ్జ్ రేయిస్ ఫౌండేషన్, వరంగల్) సంస్థ కో ఆర్డినేటర్ భూపతిరాజు, సెక్రటరీ ఆంజనేయులు తెలిపారు. ఆడిటోరియంలో లైవ్ ప్రొజెక్టర్ ద్వారా ఉద్యోగ సాధనకు అవసరమైన అంశాలపై క్లుప్తంగా అవగాహన కల్పించారు. వారధి సంస్థ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంకు ఆఫీసర్స్, రైల్వే ఉద్యోగాలు, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, పోలీసు ఉద్యోగాలు, ప్రముఖ కార్పొరేట్ కంపెనీల ఉద్యోగాలపై అవగాహన కల్పిస్తూ నిష్ణాతుల ద్వారా శిక్షణ ఇప్పించనున్నట్లు వెల్లడించారు. కలెక్టరేట్ కాంప్లెక్స్ మొదటి అంతస్తులోని రెడ్‌క్రాస్ కార్యాలయం పక్కన సంస్థ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement