దేశానికి మోడీ పాలన అవసరం | narendra modi rulling is need to country | Sakshi
Sakshi News home page

దేశానికి మోడీ పాలన అవసరం

Apr 15 2014 12:33 AM | Updated on Aug 15 2018 2:14 PM

దేశానికి మోడీ పాలన అవసరమని, ప్రజలు కూడా అతన్ని ప్రధానమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని మాజీ మంత్రి, బీజేపీ పరిగి అసెంబ్లీ అభ్యర్థి కమతం రామిరెడ్డి పేర్కొన్నారు.

కుల్కచర్ల ,న్యూస్‌లైన్:  దేశానికి మోడీ పాలన అవసరమని, ప్రజలు కూడా అతన్ని ప్రధానమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని మాజీ మంత్రి, బీజేపీ పరిగి అసెంబ్లీ అభ్యర్థి కమతం రామిరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో దేశం, రాష్ట్రం భ్రష్టుపట్టిపోయాయన్నారు. సోమవారం మండల కేంద్రంలో బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం కాంగ్రెస్ డబ్బుల పార్టీగా మారిందని, గాంధీ భవనం సీట్లు అమ్ముకునే దుకాణంగా మారిందని ఆరోపించారు. 50 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశానని, నేడు ఆపార్టీలో గౌరవం లేకనే పార్టీని వీడటం జరిగిందన్నారు.

పరిగి నియెజకవర్గంలో తాను మంత్రిగా ఉనప్పుడు చేసిన అభివృద్ధి పనులే కనిపిస్తున్నాయన్నారు. దమ్ముంటే కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నాయకులు చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఆరు దశాబ్దాల పాటు అనేక పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ అభివృద్ధి సాధించాలంటే జాతీయ పార్టీ బీజేపీకే సాధ్యమన్నారు. 20 సంవత్సరాలుగా పరిగి ప్రజలను ప్రజాప్రతినిధులు మోసం చేస్తున్నారని, తనకు మోసం చేయడం చేతకాదన్నారు. అధికారంలో లేకపోయినప్పటికీ పరిగి నియోజకవర్గ ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నానన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం కావడంలో బీజేపీ కీలకపాత్ర వహించిం దన్నారు. ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు.  కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ప్రహ్లాద్‌రావు, నాయకులు వెంకటయ్యగౌడ్, అంజిలయ్య, కుల్కచర్ల సర్పంచ్ జానకీరాం, రవిచందర్, గణేష్, మహిపాల్, చంద్రలింగం, ప్రకాష్, సం తోష్, శ్రీను, రాములు తదితరలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement