సింగరేణిలో ప్రమాదాలను నివారిస్తాం  | Sakshi
Sakshi News home page

సింగరేణిలో ప్రమాదాలను నివారిస్తాం 

Published Fri, Dec 28 2018 1:06 AM

Must be brought to the level of zero accidents happen singareni - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణిలో జరిగే ప్రమాదాలను శూన్య స్థాయికి తెచ్చేందుకు కృషిచేయాలని అధికారులకు, కార్మికులకు సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన సింగరేణి సంస్థ 45వ త్రైపాక్షిక రక్షణ సమీక్షా సమావేశంలో డెరైక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ మైన్స్‌ సేఫ్టీ, గుర్తింపు సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బొగ్గు ఉత్పత్తి, రవాణా లో వృద్ధిరేటుతో పురోగమిస్తున్న సంస్థను ప్రమాదరహితంగా రూపుదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి గనిలో మ్యాన్‌ రైడి రగ్‌ సిస్టంలను ఏర్పాటు చేశామని, అందరికీ తేలికపాటి ఎల్‌ఈడీ క్యాపు ల్యాంపులను సమకూర్చామని తెలిపారు. ఓ.సి.గనుల్లో ఓ.బి (ఓవర్‌ బర్డెన్‌) డంపు సామర్థ్యంపై సిస్రో (ఆస్ట్రేలియా కంపెనీ)తో అధ్యయనం చేయిస్తున్నామని, భూగర్భ గను ల్లో రక్షణ పెంపుదలకు తగిన శిక్షణ, సూచనల కొరకు సిమ్టార్స్‌ (ఎస్‌ఐఎమ్‌టీఆర్‌ఎస్‌) సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు.

ప్రమాదాలు జరుగుతున్న విభాగాలను, పరిస్థితులను గమనించి అక్కడ తీసు కోవాల్సిన రక్షణ చర్యలపై ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. రక్షణ అనేది యాజమాన్య బాధ్యతే కాదని, ప్రతి కార్మికుడు, ప్రతి అధికారి బాధ్యత అన్నారు. రక్షణ సూత్రాలు పాటిస్తూ, జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మాత్రమే ప్రమాదాలను నివారించి శూన్య స్థానానికి తీసుకురాగలమని పేర్కొన్నారు. డిప్యూటీ జనరల్‌ ఆఫ్‌ మైన్స్‌ సేఫ్టీ (సౌత్‌ సెంట్రల్‌ జోన్‌) విద్యాపతి మాట్లాడుతూ, సింగరేణి సంస్థ తీసుకొంటున్న రక్షణ చర్యలు ప్రశంసనీయమన్నారు. టెక్నాజీలతో ఇక్కడి అధికారులు, కార్మికులు బాగా పనిచేస్తూ బొగ్గు ఉత్పత్తిని పెంచుతున్నారని, ప్రమాదాలనూ శూన్య స్థాయికి తెచ్చేందుకు కృషి చేయాలన్నారు. గుర్తింపు కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) అధ్యక్షుడు బి.వెంకట్రావు మాట్లాడుతూ, సింగరేణి యాజమాన్యం రక్షణకు కట్టుబడి పనిచేస్తున్నప్పటికీ దురదృష్టవశాత్తు ఏటా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. వీటి నివారణకు కార్మిక సంఘాలు చేస్తున్న సూచనలను సానుకూలంగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని, కార్మికులు కూడా భద్రతతో పనిచేయాలని సూచించారు.  

Advertisement
Advertisement