మిషన్‌ భగీరథ పనులు వేగవంతం చేయాలి

Mission Bageerath Works Speedup : Smitha Sabarwal - Sakshi

ఈ నెలాఖరు నాటికి పనులు పూర్తి చేయాలి

మేలో ఇంటింటికి తాగునీరు అందేలా చర్యలు  

సీఎం కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి స్మితాసబర్వాల్‌

మిట్టగూడెం రథంగుట్ట వద్ద మిషన్‌ భగీరథ పనుల పరిశీలన

రెండు జిల్లాల అధికారులతో సమీక్ష సమావేశం

అశ్వాపురం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్‌ భగీరథ పనులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వేగవంతం చేయాలని సీఎం కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్‌ అధికారులను ఆదేశించారు. మిషన్‌ భగీరథ పథకంలో భాగంగా  మండల పరిధిలోని మిట్ట గూడెం రథంగుట్ట వద్ద నిర్మిస్తున్న 40 ఎంఎల్‌డీ  వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంటు, రథంగుట్టపై నిర్మిస్తున్న  900 కేఎల్, 3900 కేఎల్‌ రిజర్వాయర్ల పనులను మిషన్‌ భగీరథ ఉన్నతాధికారులతో కలిసి స్మితాసబర్వాల్‌ శుక్రవారం పరిశీలించా రు.

అధికారులతో మాట్లాడి పనుల పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం వాటర్‌ ట్రీట్‌మెం ట్‌ ప్లాంటు ఆవరణలో  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిషన్‌ భగీరథ పనుల పురోగతిపై భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల  మిషన్‌భగీరథ అధికారులతో సమీక్ష సమవేశం నిర్వహించారు. ఈ నెల 25 నాటికి మిట్టగూడెం రథంగుట్ట పైన నిర్మిస్తున్న రిజర్వాయర్ల ద్వారా  రావాటర్‌ను పాల్వంచ మండలం తోగ్గూడెంలో నిర్మిస్తున్న 140 ఎంఎల్‌డీ  వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంటు వరకు నీరు విడుదల చేయాలన్నారు.  ఈ నెల చివరి కల్లా కుమ్మరిగూడెం ఇంటెక్‌ వెల్, మిట్టగూడెం రథంగుట్ట వద్ద నిర్మిస్తున్న వాటర్‌ ట్రీట్‌మెంటు ప్లాంటు, రిజర్వాయర్ల పనులు పూర్తి చేయాలన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చేపడుతున్న మిషన్‌ భగీరథ పనులు ఈ నెల చివరినాటికి పూర్తి చేసి మే నెలలో ఇంటింటికి తాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. 

పనుల్లో అలసత్వం తగదు..
ఇప్పటికే పనులను మూడు సార్లు పరిశీలించామని పనుల్లో పురోగతి లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  జిల్లాలో నిర్మిస్తున్న వాటర్‌ ట్యాంక్‌లు, పైపులైన్ల పనులు త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు.  పనుల్లో అలస త్వం వహించవద్దని పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికి నల్లా ద్వారా ప్రజలకు తాగునీరు అందించేందుకు మిషన్‌ భగీరథ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని అధికారులు పనుల వేగవంతానికి చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు, భద్రాచలం సబ్‌కలెక్టర్‌ పమెలా సత్పథి,  మిషన్‌భగీరథ ఈఎన్‌సీ సురేందర్‌రెడ్డి, చీఫ్‌ ఇంజనీర్‌ విజయ్‌పాల్‌రెడ్డి, ఎస్‌ఈ శ్రీనివాస్, ఈఈలు సదాశివరావు, రవీందర్, డీపీఆర్‌ఓ శ్రీనివాసరావు, తహసీల్దార్‌ కే.విజయ్‌కుమార్,  రెండు జిల్లాల  డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top