వీడని తండ్రీకుమార్తెల మృతి మిస్టరీ
ఖమ్మం క్రైం: ఖమ్మం జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి భర్త, పెద్ద కుమార్తె అనుమానాస్పద మృతి కేసులో ఏకైక సాక్ష్యంగా ఉన్న భార్య కూడా మృతి చెందింది. ఖమ్మంలోని నివాసంలో కణతాల రాము, ఆయన పెద్దకుమార్తె దివ్యనైని మృతదేహాలను ఆదివారం రాత్రి గుర్తించగా అపస్మారక స్థితిలో ఉన్న ఆయన భార్య రమ్య, చిన్నకుమార్తె దీక్షిత ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటం తెలిసిందే. భర్త, పెద్ద కుమార్తె మృతదేహాలతో మూడు రోజులుగా ఇంట్లోనే ఉన్న రమ్య.. చిన్నకుమార్తెను సైతం హత్య చేయడానికి ప్రయత్నించినట్లు సమాచారం.
ఈ ఘటనలను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు రమ్య కూడా కొద్ది మోతాదులో పురుగుల మందు తాగినట్లు తెలిసింది. దీంతో ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను ఏసీపీ రమణమూర్తి, టూటౌన్ సీఐ బాలకృష్ణ విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పగా ఏదో విషయాన్ని దాస్తోందని వారు గుర్తించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి రమ్య పరిస్థితి విషమించి మృతి చెందింది.
దీంతో చిన్న కుమార్తె మాత్రమే మిగిలినట్లయింది. ఈ మరణాలపై రాము సోదరుడు ఉపేందర్ ఫిర్యాదుతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. రాము, దివ్యనైని శరీరంపై బలమైన గాయాలు ఉండటంతో రమ్యకు ఇంకెవరైనా సహకరించారా అనే కోణంలోనూ విచారణ చేపట్టారు. మరోవైపు నేలకొండపల్లి మండలం కోనాయిగూడెంలో కణతాల రాము, ఆయన కుమార్తె దివ్యనైని అంత్యక్రియలను బంధువులు సోమవారం నిర్వహించారు.


