గ్యాస్ సిలిండర్ల కొరతతో పంపిణీ ప్రక్రియ రోజురోజుకు క్లిష్టంగా మారుతోంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఇదే పరిస్థితి నెలకొనగా పోలీసు పహారా నడుమ సిలిండర్లు పంపిణీ చేయాల్సి వచ్చింది. నేలకొండపల్లిలోని ఏజెన్సీకి మంగళవారం 60 సిలిండర్లు వచ్చాయి. బుకింగ్ చేసుకున్న దాదాపు 200 మంది రావడం, అందరికీ అందే పరిస్థితి లేకపోవడానికి తోడు ఎండతీవ్రతతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యాలయంలోకి చొరబడడంతో గందరగోళం నెలకొంది.
ఈమేరకు పోలీసులు చేరుకుని అందరినీ బయటకు పంపించారు. అయితే, రోజుల తరబడి సిలిండర్ల కోసం చూస్తుండగా, ఇంకెన్నాళ్లు తిరగాలని నిర్వాహకులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరకు పోలీసులు అందరి నుంచి గ్యాస్కనెక్షన్ పుస్తకాలు తీసుకుని బుకింగ్ ఆధారంగా క్రమపద్ధతిలో పిలుస్తూ 60మందికి సిలిండర్లు సరఫరా చేయించారు. మిగిలినవారికి మరో దఫా రాగానే అందిస్తామని నచ్చచెప్పడంతో నిరాశగా వెనుదిరిగారు.


