సకాలంలో పూర్తి చేయండి  | Minister Harish Rao on irrigation projects | Sakshi
Sakshi News home page

సకాలంలో పూర్తి చేయండి 

Dec 13 2017 2:36 AM | Updated on Dec 13 2017 2:36 AM

Minister Harish Rao on irrigation projects - Sakshi

మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి హరీశ్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల విషయంలో టైమ్‌లైన్‌ ప్రకారం పనులు పూర్తి చేయాలని, ఎలాంటి అలసత్వం పనికి రాదని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. పూర్వ మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులన్నిటినీ వచ్చే జూన్‌ కల్లా పూర్తి చేయాలన్నారు. యాసంగి సీజన్‌లో ఎంత ఆయకట్టుకు నీరిస్తున్నారో, ఏ పంట ఎన్ని ఎకరాల్లో సాగవుతోందో సమగ్ర అంచనా రూపొందించాలని సూచించారు. మంగళవారం జలసౌథలో కల్వకుర్తి ప్రాజెక్టు పురోగతిని మంత్రి సమీక్షించారు.

ఈ ప్రాజెక్టులో బాటిల్‌ నెక్‌ సమస్యలను గుర్తించాలని, కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయడానికి నలుగురు సభ్యులతో ఒక కమిటీని నియమిస్తున్నామన్నారు. ఈ నెల 26 కల్లా ఈ కమిటీ నివేదికను సమర్పించాలన్నారు. నివేదికలోని అంశాలకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని అధికారులకు సూచించా రు. 2018 ఖరీఫ్‌ సీజన్లో 4,500 క్యూసెక్కుల ప్రవాహానికి తగిన విధంగా కల్వకుర్తి కాల్వలను సిద్ధం చేయాలని, కల్వకుర్తి లిఫ్ట్‌ 3 టన్నెల్‌లో మిగిలిన లైనింగ్‌ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చెప్పారు. మెయిన్‌ కెనాల్‌ లైనింగ్‌ పనులు, స్ట్రక్చర్ల పనులు పూర్తి చేయాలన్నారు. కల్వకుర్తితో పాటు రాజీవ్‌ భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌ పనుల పురోగతిని కూడా మంత్రి సమీక్షించారు. 

పాలమూరు ప్రాజెక్టులకు ప్రాధాన్యత.. 
ప్రాజెక్టులన్నీ పూర్తయితే పూర్వ పాలమూరు జిల్లాలో 8 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయని హరీశ్‌రావు చెప్పారు. కల్వకుర్తికి చెందిన మెయిన్‌ కెనాల్‌ సహా అన్ని డిస్ట్రిబ్యూటరీల పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కల్వకుర్తికి నీటి కేటాయింపులను 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు పెంచామని, సీఎం కేసీఆర్‌ పాలమూరు ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. వచ్చే జూన్‌ కల్లా మొత్తం 5 పంపులు పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కల్వకుర్తి ప్రాజెక్టుకు 2014 జూన్‌ వరకు పదేళ్లలో పెట్టిన ఖర్చు రూ.2,716 కోట్లు కాగా, ఈ మూడున్నరేళ్లలోనే రూ.1,121.17 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. కల్వకుర్తి నియోజకవర్గానికి నీరందించడానికి అడ్డంకిగా ఉన్న ఆవంచ ఆక్విడక్టు పనులను పూర్తి చేసి ఇప్పుడు నీటిని విడుదల చేశామన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ఈఎన్‌సీ మురళీధర్‌రావు, విజయప్రకాశ్, పెంటారెడ్డి, నరేందర్‌ రెడ్డి, సీఈలు ఖగేందర్‌రావు, లింగరాజు, ఎస్‌ఈ భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement