కేసీఆర్ దళితుల వ్యతిరేకి : మల్లురవి
సాక్షి, హైదరాబాద్ : రాత్రిపూట అంబేడ్కర్ విగ్రహాన్ని తీసివేసి చెత్త కుప్పలో వేశారని మాజీ ఎంపీ మల్లురవి మండిపడ్డారు. ఇదే అంశంపై గవర్నర్ను కలిశామని, అఖిల పక్షం భేటీ జరిగిందన్నారు. కానీ, ప్రభుత్వం ఇంతవరకు అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించిన వారిపై చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మంగళవారం ఉదయం అంబేడ్కర్ విగ్రహం పెట్టడానికి వెళితే లారీతో పాటు విగ్రహం కూడా తీసుకెళ్లారన్నారు. వి.హనుమంతరావుతో పాటు దాదాపు 60మందిని పోలీసులు అరెస్ట్ చేశారన్నారు.
కేసీఆర్ దళితుల వ్యతిరేకి అని మల్లు రవి నిప్పులు చెరిగారు. తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి దళితుడు అనిచెప్పి చేయలేదని, ఆ తరువాత ఉప ముఖ్యమంత్రిని చేసి కారణం లేకుండా తొలగించారని తూర్పారబట్టారు. ఇప్పుడు అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించారని, వెంటనే ప్రభుత్వమే విగ్రహ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.