మిర్యాలగూడలో లాకప్‌డెత్! | Sakshi
Sakshi News home page

మిర్యాలగూడలో లాకప్‌డెత్!

Published Tue, Jul 7 2015 10:59 PM

Lockup death in miryalaguda

మిర్యాలగూడ టౌన్: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లోని బాత్‌రూమ్‌లో ఓ వ్యక్తి మంగళవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన అశోక్‌వెంకట్(42) అనే వ్యక్తిని ఉదయం 8నుంచి 10 గంటల మధ్య పోలీసులు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చినట్లు తెలిసింది. కాగా, సాయంత్రం సమయంలో అశోక్‌వెంకట్ బాత్‌రూమ్‌లోకి వెళ్లి చొక్కాతో ఉరి వేసుకున్నాడు. కాగా చాలా బరువుగా ఉన్న అశోక్‌వెంకట్ షర్టుతోనే చనిపోయాడా..? లేక విచారణలో పోలీసులు ఏమైన తీవ్రంగా కొట్టిచంపారా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అతన్ని ఏదైనా కేసు నిమిత్తం తీసుకువచ్చారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. అయితే పోలీసులు మాత్రం అతనికి మతిస్థిమితం లేదని, ఎలాంటి కేసులు కూడా లేవని చెబుతున్నారు. సంఘటన స్థలాన్ని ఎస్‌పీ విక్రమ్‌జీత్ దుగ్గల్, డీఎస్‌పీ సందీప్ గోనే సందర్శించారు. అనంతరం సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంపై ఎస్‌పీ మాట్లాడుతూ ఇది కస్టోడియల్ డెత్‌గా భావిస్తున్నామని, సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు. కాగా, గతంలో ఓ దొంగతనం కేసులో చక్రధర్‌రావు అనే వ్యక్తి ఇదే పోలీస్‌స్టేషన్‌లో మృతి చెందాడు.

Advertisement
Advertisement