లెక్చరర్ వేధింపులు తాళలేక.. | Lecturer harassment... | Sakshi
Sakshi News home page

లెక్చరర్ వేధింపులు తాళలేక..

Dec 4 2014 4:16 AM | Updated on Nov 9 2018 5:02 PM

లెక్చరర్ వేధింపులు తట్టుకోలేని ఓ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది.

విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
సమితిసింగారం (మణుగూరు రూరల్): లెక్చరర్ వేధింపులు తట్టుకోలేని ఓ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. ఆ విద్యార్థిని తండ్రి తెలిపిన ప్రకారం... మణుగూరు మండలం సమితిసింగారం పంచాయతీలోని గుట్టమల్లారంలోగల గ్రేస్ మిషన్ జూనియర్ కాలేజీలో అశ్వాపురం మండలం మల్లెమడుగు గ్రామానికి చెందిన విద్యార్థిని చదువుతోంది. ఆమె రోజూ కాలేజి బస్సులో వెళ్లి వస్తోంది.

అదే కాలేజీలో ఇంగ్లిష్ లెక్చరర్‌గా అశ్వాపురం గ్రామానికి చెందిన రాజారావు పనిచేస్తున్నాడు. అతడు కూడా అదే బస్సులో ప్రయూణిస్తూ, ఆ విద్యార్థినిని మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. ఆమె మంగళవారం కాలేజీ నుంచి ఇంటికి వచ్చి, తనను లెక్చరర్ రాజారావు వేధిస్తున్నాడని, ఇకపై ఆ కాలేజీకి వెళ్లనని తండ్రితో చెప్పింది. ఆ తరువాత, సూసైడ్ నోట్ రాసి, పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. భద్రాచలంలోని ప్రైవేటు ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోంది.
 
కఠినంగా శిక్షించాలని ఆందోళన
తన కుమార్తెను వేధించి, ఆమె ఆత్మహత్య యత్నానికి కారకుడైన లెక్చరర్‌ను కఠినంగా శిక్షించాలన్న డిమాండుతో విద్యార్థిని కుటుంబీకులు, బంధువులు కలిసి బుధవారం ఉదయం మణుగూరులోని కాలేజి వద్ద ఆందోళనకు దిగారు. వారికి మద్దతుగా యువజన, విద్యార్థి సంఘాల నాయకులు అక్కడకు వచ్చారు. ప్రిన్సిపాల్‌ను ఆందోళనకారులు, విద్యార్థి సంఘాల నాయకులు నిలదీశారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని మణుగూరు ఎస్సై ఎం.అరుణ్ కుమార్ హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. నిందితుడైన లెక్చరర్ రాజారావు మంగళవారం రాత్రి పరారైనట్టు స్థానికులు చెప్పారు. అశ్వాపురం సీఐ వేణుచందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement