భూముల రిజిస్ట్రేషన్ ధరల పెంపు | land registations in telangana willbe increase from august | Sakshi
Sakshi News home page

భూముల రిజిస్ట్రేషన్ ధరల పెంపు

Jun 13 2015 5:13 AM | Updated on Sep 3 2017 3:38 AM

భూముల రిజిస్ట్రేషన్ ధరల పెంపు

భూముల రిజిస్ట్రేషన్ ధరల పెంపు

రాష్ట్రవ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంచేం దుకు తెలంగాణ సర్కారు సన్నద్ధమైంది.

- ఆగస్టు 1 నుంచీ కొత్త ధరల అమలుకు సర్కారు నిర్ణయం
- జిల్లాల వారీగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల కసరత్తు
- వచ్చే నెల 20 నుంచి వెబ్‌సైట్లో పెంపు ప్రతిపాదనలు

 
సాక్షి, హైదరాబాద్:
రాష్ట్రవ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంచేం దుకు తెలంగాణ సర్కారు సన్నద్ధమైంది. జిల్లాల వారీగా చార్జీల పెంపు ప్రతిపాదనలను రూపొందించేందుకు రెవెన్యూ డివిజనల్ అధికారులు(ఆర్డీవో)/ జాయింట్ కలెక్టర్ల(జేసీ) అధ్యక్షతన సబ్ రిజిస్ట్రార్లతో కమిటీలను కూడా ఏర్పాటు చేసింది.

వాస్తవానికి గత ఏప్రిల్ 1 నుంచే భూముల రిజిస్ట్రేషన్ ధరలను ప్రభుత్వం సమీక్షించాల్సి ఉండగా, అనివార్య పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రతిపాదనను విరమిం చుకుంది.  ఆగస్టు 1వ తేదీ నుంచే రాష్ట్రంలో కొత్త రిజిస్ట్రేషన్ ధరలను అమలు చేయాలని  ప్రభుత్వం నిర్ణయించింది. 2013 ఏప్రిల్ 1న  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ధరలను పెంచిన సంగతి తెలిసిందే.

మార్కెట్ విలువ ప్రకారమే
మార్కెట్ ధరలను బట్టే భూముల రిజిస్ట్రేషన్ ధరలను ప్రతిపాదించాలని సబ్‌రిజిస్ట్రార్లకు రిజిస్ట్రేషన్ల శాఖ తాజాగా ఆదేశించింది. గ్రామీణ , పట్టణ ప్రాంతాల్లో భూమి విలువను(10 నుంచి 70 శాతం వరకు) ఎంత శాతం పెంచవచ్చో ప్రత్యేక ఫార్మాట్ ద్వారా వివరంగా తెలపాలని సూచించింది. ధరలు పెరిగిన, ధరలు బాగా తగ్గిన ప్రాంతాలను కూడా ఫార్మాట్‌లో పేర్కొనాలని ఆదేశించింది. హైదరాబాద్ శివారులోని కొన్ని మండలాల్లో భూముల మార్కెట్ విలువ గణనీయంగా పడిపోయినందున, ఆయా ప్రాం తాల్లో భూముల రిజిస్ట్రేషన్ల ధరలను తగ్గించాల్సిన అవసరం ఉందని ఇటీవల రిజిస్ట్రేషన్లశాఖ సర్కారుకు ప్రతిపాదనలు పంపింది.

ఈ ఏడాది భూముల రిజిస్ట్రేషన్ల ధరల పెంపు నామమాత్రంగా ఉండవచ్చని రిజిస్ట్రేషన్‌శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. భూముల రిజిస్ట్రేషన్ ధరల పెంపు ప్రతిపాదనకు ఆర్థిక శాఖ అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. భూముల రిజిస్ట్రేషన్ ధరల పెంపునకు సంబంధించి ఆర్డీవో/జేసీల అధ్యక్షతన ఏర్పాటైన కమిటీలు ఈ నెలాఖరులోగా ప్రతిపాదనలను సమర్పించనున్నాయి. వచ్చే నెల 20 నుంచి వాటిని రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్‌లో ఉంచుతారు. వీటిపై వారం రోజులపాటు అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ధరలు అమల్లోకి వస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement