రాజన్న సిరిసిల్ల.. రాష్ట్రానికే ఆదర్శం | Sakshi
Sakshi News home page

రాజన్న సిరిసిల్ల.. రాష్ట్రానికే ఆదర్శం

Published Sat, Jun 2 2018 1:46 PM

KTR Praises Rajanna Sircilla District Officers For Making Open Defecation FreeTown - Sakshi

రాజన్న సిరిసిల్ల జిల్లా : స్వచ్ఛత, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో దేశంలోనే జిల్లాకు అరుదైన ఖ్యాతి లభించడం మనందరికీ దక్కిన గౌరవమని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు హర్షం వ్యక్తం చేశారు. సిరిసిల్లలో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్‌ మాట్లాడుతూ.. యావత్‌ భారతానికి తెలంగాణను, తెలంగాణకు సిరిసిల్ల జిల్లాను దిక్సూచిగా నిలుపుదామంటూ పిలుపునిచ్చారు. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన స్వచ్ఛ దర్పణ్ ర్యాకింగ్‌లో జిల్లాకు ప్రథమ బహుమతి లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత తొలి జిల్లాగా సిరిసిల్ల ప్రత్యేకతను సంతరించుకుని రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రాబోయే రోజుల్లో ఇదే ఉత్సాహంతో ముందుకు సాగుతూ బంగారు తెలంగాణను సాధించుకుందామని పిలుపునిచ్చారు. జిల్లాను అగ్రస్థానంలో నిలిపిన ఉద్యోగుల సేవలు గుర్తించడంతో పాటు, సమస్యలకు పరిష్కారం చూపుతూ, వారి సంక్షేమానికై ప్రభుత్వం కృషి చేస్తోందని కేటీఆర్‌ తెలిపారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవడానికి, నేతన్నల నుంచి వస్త్రాలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.

సుదీర్ఘ పోరాట ఫలితం తెలంగాణ..
సంకల్పం గట్టిదైతే ఎన్ని అవరోధాలైనా అవలీలగా అడ్డుకోవచ్చని తెలంగాణ ఉద్యమం నిరూపించిందని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. సుదీర్ఘ పోరాట ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం సఫల రాష్ట్రంగా స్థిరపడిందని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రం ప్రగతి దారుల వెంట వేగంగా పయనిస్తోందని, ఇది ఒక చారిత్రాత్మక విజయయాత్ర అని కేటీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్ర పురోగమనాన్ని అడ్డుకోవాలనే ప్రతిఘాతక శక్తుల ప్రయత్నాలు ఆనాడు పోరాటంలో.. ఈనాడు పాలనలోనూ ఎదురవుతున్నప్పటికీ ప్రభుత్వం వాటిని తిప్పికొడుతోందని తెలిపారు.  

Advertisement
Advertisement