అందుకే మాపై విమర్శలు చేశారు : కేటీఆర్
సాక్షి, రాజన్న సిరిసిల్ల : కాంగ్రెస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక కేసీఆర్పై, తనపై, తన కొడుకుపై కూడా విమర్శలు చేశారని తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ అన్నారు. ముస్తాబాద్లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ కార్యకర్త సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ వాళ్లు దాదాపు నాలుగు వందల కేసులు వేసి తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని, చంద్రబాబు నాయుడు ఐదు వందల కోట్లతో తెలంగాణలో మళ్లీ పాగా వేయటానికి బయలుదేరాడని అన్నారు. తెలంగాణ ప్రజల ముందు 67 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ దరిద్రపు పాలన.. నాలుగు సంవత్సరాల కేసీఆర్ సుభిక్ష పాలన ఉందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ వాళ్ళ పవర్ కట్ చేస్తేనే! తెలంగాణకు కరెంటు వచ్చిందని, మళ్ళీ అదే విధంగా ప్రజలు తీర్పు ఇవ్వాలని కోరారు. రైతులను రాబందుల్లాగా పీక్కుతిన్న పార్టీల వైపు ఉంటారో.. రైతుబంధు పథకం పెట్టి రైతుల అభివృద్ధికి పాటుపడ్డ కేసీఆర్ వైపు ఉంటారో ప్రజలు తేల్చుకోవాలన్నారు. సంక్షేమ పథకాలలో భారతదేశంలోనే తెలంగాణ అగ్రస్థానం స్థానంలో ఉందని తెలిపారు.