డీపీఆర్‌లు ఇవ్వాల్సిందే

Krishna Management Board Meet : AP And TS Agrees To Submit DPR Of New Projects - Sakshi

కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ, అపెక్స్‌ కౌన్సిల్‌లకు సమర్పించాలి

కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులకు అనుమతి తీసుకోవాలి

తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు ఆదేశం

డీపీఆర్‌లు ఇచ్చేందుకు అంగీకరించిన ఇరు రాష్ట్రాలు

విద్యుదుత్పత్తి, వరద జలాలను చెరిసగం పంచుకునేందుకు ఓకే

బేసిన్‌ ప్రాజెక్టుల నిర్మాణాలపై ఎవరి వాదన వారిదే..

తెలంగాణలో కొత్త ప్రాజెక్టులు లేవన్న రాష్ట్రం

పాలమూరు, డిండి, తుమ్మిళ్ల పాతవేనని స్పష్టీకరణ

ఏపీ తెచ్చిన 203 జీవో అక్రమమని తెలంగాణ వాదన..

పట్టిసీమ కింద 45 టీఎంసీల వాటా ఇవ్వాలని వినతి

లెక్కలు తేల్చేవరకు 34:66 నిష్పత్తిన పంచుకునేందుకు అంగీకారం

కృష్ణా బేసిన్‌లోని అన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లు అడిగాం. అనుమతులు లేని ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దని చెప్పాం. ప్రభుత్వాల అనుమతితో డీపీఆర్‌లు ఇస్తామని ఇరు రాష్ట్రాల ఇంజనీర్లు చెప్పారు. బోర్డు విజయవాడకు తరలింపుపై కేంద్ర జల శక్తి శాఖ ఆదేశాల కోసం చూస్తున్నాం. అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీకి ఎజెండా అడిగాం. రాష్ట్రాలు పంపే ఎజెండా కోసం ఎదురుచూస్తున్నాం. – పరమేశం, బోర్డు చైర్మన్‌

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా నది బేసిన్‌ పరిధిలో కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులకు సాంకేతిక అనుమతి కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లను కృష్ణాబోర్డు, కేంద్ర జల సంఘానికి ఇవ్వాల్సిం దేనని తెలుగు రాష్ట్రాలను బోర్డు ఆదేశించింది. అలాగే అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి కోసం పంపాలని సూచించింది. బోర్డు, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేని ప్రాజెక్టులపై ముందు కెళ్లొద్దని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకొని డీపీఆర్‌లను అందిస్తామని ఇరు రాష్ట్రాల అధికారులు తెలిపారు. అయితే ఎప్పటిలోగా డీపీఆర్‌లు ఇవ్వాలన్న దానిపై మాత్రం నిర్ణీత సమయాన్ని ప్రకటించలేదు. కృష్ణా నదీ బేసిన్‌ల పరిధిలో ప్రాజెక్టుల కింద ఈ ఏడాది కూడా గతేడాదిలాగే 34:66 నిష్పత్తిన నీటిని పంచుకునేందుకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అంగీకరించాయి.

మైనర్‌ ఇరిగేషన్‌ కింద జరుగుతున్న నీటి వినియోగం, మళ్లింపు జలాల అంశంపై తేల్చేవరకు పాత వాటాల ప్రకారమే నీటిని పంచుకోవాలన్న బోర్డు సూచనకు ఇరు రాష్ట్రాలు సమ్మతిం చాయి. కృష్ణా నది బేసిన్‌ పరిధిలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు, ఈ ఏడాదిలో నీటి పంపిణీ, డీపీఆర్‌లు, మళ్లింపు జలాల్లో వాటా, టెలిమెట్రీ వ్యవస్థల ఏర్పాటు అంశాలపై చర్చించేందుకు కృష్ణాబోర్డు గురు వారం జలసౌధలో భేటీ అయింది. బోర్డు చైర్మన్‌ పరమేశం అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి తెలంగాణ, ఏపీ నీటిపారుదల శాఖ కార్య దర్శులు రజత్‌కుమార్, ఆదిత్యనాధ్‌ దాస్‌లతో పాటు ఈఎన్‌సీలు మురళీధర్, నారాయణరెడ్డి, తెలంగాణ ఇంజనీర్లు నరసింహారావు, నర్సింహా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బోర్డు అజెండా అంశాలతో పాటు ఇరు రాష్ట్రాలు ప్రతిపాదించిన అంశాలపై 6 గంటల పాటు చర్చించారు. ఈ భేటీలో కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు, నీటి వాటాల అంశంపై వాడీవేడీగా వాదనలు జరిగాయి.

అప్పటిదాకా చెరిసగం..
ఇరు రాష్ట్రాలు తమ ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో మాట్లాడిన అనంతరం డీపీఆర్‌లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్లు భేటీ అనంతరం కృష్ణా బోర్డు చైర్మన్‌ పరమేశం వెల్లడించారు. మైనర్‌ ఇరిగేషన్‌ కింద నీటి వినియోగం, మళ్లింపు జలాలపై తుది నిర్ణయం చేసే వరకు గతేడాదిలో ఉన్న మేర ఇరు రాష్ట్రాలు 34ః 66 నిష్పత్తిన నీటిని వాడుకునేందుకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అంగీకరించినట్లు తెలిపారు. టెలీమెట్రీ రెండో విడత ఏర్పాటుకు సంబంధించి నిధులు విడుదల చేసేందుకు కూడా ఇరు రాష్ట్రాలు అంగీకరించినట్లు వెల్లడించారు.

ఇక, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల కింద విద్యుదుత్పత్తిని 50ః 50 నిష్పత్తిన చేసుకునేందుకు ఓకే చెప్పాయి. వరద జలాల వినియోగం సైతం ఏ విధమైన పంపిణీ ఉండాలన్న దానిపై సీడబ్ల్యూసీ సీఈ నేతత్వంలోని కమిటీ తేల్చే వరకు ఇరు రాష్ట్రాలు 50ః 50 నిష్పత్తిన పంచుకునేందుకు అంగీకారం తెలిపాయి. గృహావసరాలకు వినియోగించే నీటిలో 20 శాతాన్ని మాత్రమే వినియోగం కింద చూపాలన్న అంశంపై సీడబ్ల్యూసీ తేలుస్తుందని బోర్డు స్పష్టం చేసింది. ఈ ఏడాది వినియోగించుకోలేని నీటిని తర్వాతి ఏడాదికి క్యారీ ఓవర్‌ చేయాలన్న తెలంగాణ వినతిపై ఏపీ ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలిపాక నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. ఇక, గోదావరి నుంచి కృష్ణా బేసిన్‌కు నీటి మళ్లింపుతో దక్కే నీటి వాటాల పంపిణీ అంశంపై కేంద్ర జల శక్తి పరిశీలనకు పంపినట్లు బోర్డు స్పష్టం చేసింది. ఇక బోర్డు కార్యాలయాన్ని విజయవాడకు తరలించే అంశం జలశక్తి సూచన మేరకు ఉంటుందని తెలిపింది.


జలసౌధలో గురువారం జరిగిన కృష్ణా బోర్డు సమావేశం అనంతరం బయటకు వస్తున్న రజత్‌కుమార్‌ 

తెలంగాణ వాదనలు ఇలా..
పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల ప్రాజెక్టు పూర్తిగా పాతవే. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్‌ తయారు చేయాలని 2013 ఆగస్టులోనే అప్పటి ప్రభుత్వం జీవో–72 ఇచ్చింది. 2014 ఏప్రిల్‌ ఎన్నికల సభలో ప్రధాని నరేంద్రమోదీ సైతం ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. బోర్డు సమావేశంలో మోదీ మాట్లాడిన వీడియోను రజత్‌కుమార్‌ ప్రదర్శించారు.
డిండి ప్రాజెక్టును 2007 జూలైలోనే జీవో–159 ఇచ్చారు. ఇది ముమ్మాటికీ పాత ప్రాజెక్టు.
తెలంగాణ ఏర్పాటు అనంతరం వీటిని రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకున్నాం. రీ–ఇంజనీరింగ్‌ చేశాం.. తప్పితే కొత్తగా చేపట్టినవి కావు.
2016 సెప్టెంబర్‌లో జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో ఈ ప్రాజెక్టులు పాతవేనని స్పష్టం చేశాం. అనంతరం పాలమూరు ప్రాజెక్టుకు కేంద్రం అటవీ అనుమతులు, పర్యావరణ అనుమతులు ఇచ్చింది. డిండి ప్రాజెక్టుకు సైతం వివిధ కేంద్ర అనుమతులు పొందేందుకు టీవోఆర్‌ ఇచ్చింది.
ఏపీ జీవో 203లో పేర్కొన్న శ్రీశైలం నుంచి 3 టీఎంసీల నీటిని తీసుకుంటూ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డి పాడు కాల్వల సామర్థ్యం 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంపు ప్రతిపాదనలు పూర్తిగా కొత్తవి. వీటికి అటు బోర్డు కాని, ఇటు అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి కానీ లేదు. కావున ఇవి పూర్తిగా కొత్తవే. వీటిని అపెక్స్‌ ముందు పెట్టాలి. అప్పటివరకు వీటిని ఆపాలి.
పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీ ద్వారా 101 టీఎంసీల మేర మాత్రమే నీటిని తీసుకునే వెసులుబాటు ఉన్నా గడిచిన రెండేళ్లుగా ఏపీ వినియోగం వరుసగా 115 టీఎంసీ, 175 టీఎంసీలుగా ఉంది.
శ్రీశైలం ఆధారంగా తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులన్నీ 60 వరద దినాలను పరిగణనలోకి తీసుకుంది. కానీ ఏపీ మాత్రం ప్రస్తుతం 30 వరద దినాలనే పరిగణనలోకి తీసుకొని నీటిని తరలించుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇది అసంబద్ధం.
పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీ ద్వారా తాగునీటికి తమకు 3.5 టీఎంసీలు సరిపోతాయని బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ ముందు వేసిన అఫిడవిట్‌లో తెలంగాణ పేర్కొంది కావున ఇప్పుడు దాని సామర్థ్యాన్ని ఇంతలా పెంచాల్సిన అవసరం లేదు.
పోతిరెపడ్డిపాడు ద్వారా శ్రీశైలంలో 880 అడుగులున్నప్పుడు మాత్రమే 44 వేల క్యూసెక్కులు తీసుకెళ్లే వీలుంది. తగ్గిన పక్షంలో అంత నీటిని తీసుకెళ్లలేమనే ఏపీ వాదన తప్పు. 870 అడుగుల మట్టంలోనే 44 వేల క్యూసెక్కులు తీసుకెళ్లొచ్చు. 865 మట్టంలో 33 వేలు, 859 అడుగుల మట్టంలో 20 వేల క్యూసెక్కుల నీటిని తీసుకోవచ్చు.
శ్రీశైలం వరద జలాలపై ఆధారపడి కల్వకుర్తి (40 టీఎంసీ), ఎస్‌ల్‌బీసీ(30), పాలమూరు–రంగారెడ్డి (90), డిండి (30 టీఎంసీ)ల ప్రాజెక్టులను తెలంగాణ నిర్మిస్తోంది. ఇవన్నీ ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల అవసరాలు తీర్చేవే. కనీసంగా 20 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేవి. శ్రీశైలం నీళ్లు ఏపీ తరలించుకుపోతే ఈ ప్రాంతమంతా ఎడారిగా మారుతుంది.
శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు నీరు రావాలంటేనే సెప్టెంబర్‌ పడుతుంది. ప్రస్తుతం శ్రీశైలం నుంచి నీటిని ఎప్పటికప్పుడు తీసుకుంటే అక్టోబర్, నవంబర్‌ వరకు నీరు రావడం గగనమే. అదే జరిగితే సాగర్‌ కింది ఆయకట్టు 6.4 లక్షల ఎకరాలతో పాటు ఏఎంఆర్‌పీ తాగు, సాగు నీటి అవసరాలకు పూర్తిగా విఘాతమే.
1978 గోదావరి అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టు చేపట్టిన వెంటనే నాగార్జునసాగర్‌కు ఎగువన ఉన్న రాష్ట్రాలకు అంతే పరిమాణంలో నీటి హక్కులు సంక్రమిస్తాయి. ఆ లెక్కన తెలంగాణకు 45 టీఎంసీల వాటా రావాలి. పోలవరం కాకుండా వేరే ఇతర ప్రాజెక్టులు చేపట్టినా అంతే నీటి వాటా దక్కుతుంది. ప్రస్తుతం పట్టిసీమ ద్వారా నీటి మళ్లింపు జరుగుతున్నందున కనీసంగా 45 టీఎంసీల వాటా తెలంగాణకు ఇవ్వాలి. ఈ ఏడాదే 299 టీఎంసీల వాటాకు కలపాలి.
ఈ ఏడాదిలో సాగర్‌ కింద కేటాయింపులు ఉండి, వినియోగించుకోలేకపోయిన నీళ్లు 50 టీఎంసీల వరకు ఉన్నాయి. వాటిని ఈ ఏడాది వాటర్‌ ఇయర్‌లో తెలంగాణకు క్యారీ ఓవర్‌ చేయాలి.
వరద భారీగా ఉన్న రోజుల్లో చేసే వినియోగాన్ని రాష్ట్రాల వినియోగం కింద చూడరాదన్న ఏపీ వాదన తప్పు. వరద ఉండే రోజుల్లో ఏపీ రోజుకు 48 వేల క్యూసెక్కుల నీటిని మళ్లించి 300 టీఎంసీల మేర నీటిని నింపుకునేలా రిజర్వాయర్‌లు ఉన్నాయి. కానీ తెలంగాణకు రోజుకు 3,200 క్యూసెక్కుల నీటిని మాత్రమే మళ్లించే సామర్థ్యం ఉంది. కావున వరద జలాలను వినియోగ లెక్కల్లో చూపాల్సిందే. 


బోర్డు సమావేశం అనంతరం బయటకు వస్తున్న ఆదిత్యనాథ్‌ దాస్, మురళీధర్‌ తదితరులు 

ఏపీ వాదనలు ఇవి..
పాలమూరు ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రంలో వాటినే చేపట్టేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలు తేల్చేందుకు మాత్రమే అనుమతులు ఇచ్చారు. జూరాల ప్రాజెక్టు జల విస్తరణ ప్రాంతం నుంచి నీటిని తరలించేలా సాధ్యాసాధ్యాల నివేదికకు అనుమతిస్తే, తెలంగాణ దాన్ని శ్రీశైలం నుంచి 90 టీఎంసీలు తరలించేలా చేపట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన జీవోలపై నివేదికలు రాలేదు. రాష్ట్ర విభజన తర్వాతే తెలంగాణ దాన్ని చేపట్టింది. కావున అది ముమ్మాటికీ కొత్త ప్రాజెక్టుగానే పరిగణించాలి.
డిండి ప్రాజెక్టుకు సర్వేకు మాత్రమే అనుమతిచ్చారు. తప్పితే అది చేపట్టేందుకు కాదు. దీన్ని తెలంగాణ కొత్తగా చేపడుతోంది. ఇక తుమ్మిళ్ల ఎత్తిపోతలకు ఎలాంటి అనుమతులు లేవు. భక్త రామదాస సైతం కొత్తదే. మా రాష్ట్ర ప్రయోజనాలకు ఈ ప్రాజెక్టులు విఘాతం.
కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుల సామర్థ్యాలను సైతం పెంచారు. ఈ అన్ని ప్రాజెక్టులకు బోర్డు, కేంద్ర జల సంఘం, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేదు. వీటన్నింటినీ కొత్త ప్రాజెక్టుగానే పరిగణించాలి.
అనుమతి లేని ప్రాజెక్టులు, నిర్మాణంలోని ప్రాజెక్టు సామర్థ్యం పెంపుతో తెలంగాణ అదనంగా 178 టీఎంసీల మిగులు జలాలు తరలిస్తోంది. వీటి ప్రభావం రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై ఉంటుంది.
బేసిన్‌లోని శ్రీశైలం, సాగర్‌లను కచ్చితంగా బోర్డు నియంత్రణలోకి తేవాలి. నీటి విడుదల అజమాయిషీ బోర్డు చేతుల్లో ఉంటేనే సజావుగా ఉంటుంది. వివాదాలకు ఆస్కారం ఉండదు.
రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న మేరకు బోర్డును విజయవాడకు తరలించాలి.
పట్టిసీమ ద్వారా మళ్లించే జలాలపై కేంద్ర జల శక్తి శాఖ మాత్రమే నిర్ణయం చేయాలి. తెలంగాణ సైతం గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్నారు. దీనిపైనా తేల్చాల్సి ఉంది. 
శ్రీశైలంలో 800 అడుగుల్లో నుంచి నీటిని తీసుకొని రాయలసీమ, నెల్లూరు జిల్లాల అవసరాలు తీర్చేందుకు పోతిరెడ్డిపాడు కాల్వల సామర్థ్యం పెంపు, రాయలసీమ ఎత్తిపోతల పథకాలను చేపట్టాం. రాష్ట్రానికి ఉన్న 511 టీఎంసీల వాటాల్లోంచే నీటిని వినియోగించుకుంటాం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top