పొలం గట్లపై కలెక్టర్‌ దంపతులు | Khammam Collector RV Karnan in fields with Wife Priyanka | Sakshi
Sakshi News home page

పొలం గట్లపై కలెక్టర్‌ దంపతులు

Aug 9 2019 1:17 PM | Updated on Aug 9 2019 1:51 PM

Khammam Collector RV Karnan in fields with Wife Priyanka - Sakshi

సాక్షి, ఖమ్మం: జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, ఆయన సతీమణి జెడ్పీ సీఈవో ప్రియాంకతో కలిసి గురువారం పొలం గట్లపై కలియతిరిగారు. కామేపల్లి మండలం పొన్నెకల్లు-నెమలిపురి మధ్యలో ఉన్న బుగ్గవాగు చెక్‌ డ్యాం ఫీడర్‌ చానల్‌ పనులను ఆయన పరిశీలించారు. కట్టు కాలువ చూసేందుకు దారి లేకపోవడంతో పొలం గట్లపై కలెక్టర్‌ దంపతులు గంటసేపు నడిచి వెళ్లారు.

వంతెన ఎక్కి వాగును దాటి... ఐటీడీఏ పీఓకు నీల్వాయివాగు కష్టాలు

నీల్వాయివాగు కష్టాలు ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌ (పీఓ) కృష్ణ ఆదిత్యకు కూడా తప్పలేదు. వాగు దాటడానికి 28 గ్రామాల ప్రజలు అనుభవిస్తున్న నిత్య కష్టాలను ఆయన చవిచూశారు. గురువారం ఇతర అధికారులతో కలసి మండలంలో ఆకస్మిక తనిఖీకి వచ్చారు. మార్గమధ్యలో ఉన్న నీల్వాయివాగు వరకు తన వాహనంలో వచ్చారు. వాగు వద్ద తాత్కాలిక వంతెన కొట్టుకుపోగా వాగు దాటలేని పరిస్థితి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం.. వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో మండల కేంద్రం. 

అక్కడే మామిడి తోటల్లో వాహనాలను నిలిపేసి పక్కనే ఉన్న అసంపూర్తి హైలెవల్‌ వంతెన వద్దకు నడుచుకుంటూ వెళ్లారు. వంతెనకు ఇరువైపులా అప్రోచ్‌రోడ్డు నిర్మించలేదు. ప్రజలు ఎక్కేందుకు కొద్దిపాటి మట్టి పోయించారు. వాహనాలు, బైక్‌లు కూడా దాటలేవు. వర్షాలకు మట్టి తడిసి రాకపోకలతో బురదగా మారింది. చేసేదేమీలేక ప్యాంట్, చెప్పులు పట్టుకుని.. వర్షంలో తడుస్తూ మోకాలు లోతు బురదలో జారుతూ అతికష్టం మీద 10 మీటర్ల వంతెనపైకి ఎక్కారు. దిగేచోటా అతికష్టంగా.. దిగారు. ప్రధాన రహదారి వరకు బురదలో నడుచుకుంటూ వెళ్లారు. వాగు ఒడ్డున ఉన్న ప్రైవేట్‌ వాహనం అద్దెకు మాట్లాడుకుని మండల కేంద్రానికి వచ్చి వెళ్లారు.    

Advertisement
 
Advertisement
Advertisement