వామ్మో ‘జంకు’ ఫుడ్‌ | Keep Away Your Childrens From Junk Food | Sakshi
Sakshi News home page

వామ్మో ‘జంకు’ ఫుడ్‌

Dec 23 2019 9:43 AM | Updated on Dec 23 2019 9:43 AM

Keep Away Your Childrens From Junk Food  - Sakshi

సాక్షి, పెద్దపల్లికమాన్‌: చిన్నారులను జంకు ఫుడ్‌ అనారోగ్యంవైపు నడిపిస్తోంది. పాఠశాలల సమీపంలోని దుకాణాల్లో సురక్షితంకాని తినుబండారాలు విక్రయిస్తుండడం వాటికి ఆకర్శితులై అనారోగ్యాన్ని ‘కొని’ తెచ్చుకుంటున్నారు.  

చిన్నారులకు అనారోగ్యం..
పాఠశాలలకు సమీపంలో విక్రయించే తినుబండారాలు చిన్నారులకు అనారోగ్యాన్ని తెచ్చిపెడుతున్నాయి. చక్కెర, ఉప్పు, కొవ్వు అధిక మోతాదులో ఉండడంతో అవి తిన్న పిల్లలు ఆస్పత్రుల బాట పట్టాల్సి వస్తోంది. పాఠశాల ప్రాంగణ పరిసరాల్లో ఇలాంటివి విక్రయించరాదని గతంలో ఆహార నియంత్రణ సంస్థ, భారత ఆహారభద్రత, ప్రమాణాల నియంత్రణ సంస్థ కఠిన నిబంధనలు రూపొందించాయి. 50 మీటర్ల దూరంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. అయినా చాలాచోట్ల ఈ నిబంధనలు అమలు కావట్లేదు. దీనికితోడు పెద్దపల్లి జిల్లాకేంద్రంలో మూడు నాలుగు తినుబండారాల కంపెనీలు నాసిరకం నూనెతో, అపరిశుభ్ర వాతావరణంలో తినుబండారాలు తయారు చేసి జిల్లావ్యాప్తంగా సరఫరా చేస్తున్నారు. 

ఆహార భద్రతా మండలి సర్వే వాస్తవాలు
⇔  నాసిరకం ఆహార పదార్ధాల విక్రయాలు అరికట్టడంలో తెలంగాణలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చివరస్థానంలో ఉంది.
⇔ రాష్ట్రంలో పూర్తిస్ధాయిలో ఆహార భద్రతా నియంత్రణా«ధికారులు, సిబ్బంది లేరు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 10 మందే ఉన్నారు. ఆహార నమూనాలు ⇔ నియంత్రణాధికారులు లేకపోవడంతో పాఠశాలలకు సమీపంలో చిల్లర దుకాణాలు, రంగు రంగుల కొవ్వు ఆహార పదార్థాలు చిన్నారులు చూసి కొనుక్కుని రోగాలబారిన పడుతున్నారు.
⇔ నియంత్రణ, పర్యవేక్షణాధికారులు లేకపోవడంతో నాసిరకం నూనె,పిండితో తినుబండారాలు తయారు చేసే కేంద్రాలు జిల్లాలో పుట్టగొడుగుల్లా   పుట్టుకోస్తున్నాయి. 

సిబ్బంది కొరతతో కొరవడిన తనిఖీలు
పర్యవేక్షించాలి్సన అధికారులు, సిబ్బంది కొరతతో జిల్లాలోని ఆయా దుకాలు, కార్ఖానాల నిర్వహణ యథేచ్ఛగా సాగుతోంది. ఆహార తనిఖీ అ«ధికారులు జిల్లాకు ముగ్గురు చొప్పున ఉండాలి. కానీ రాష్ట్రంలోనే 10 మంది ఉన్నారు. పెద్దపల్లి జిల్లాలో రెండేళ్లక్రితం ఆహార తనిఖీ అధికారి రిటైరైతే ఇప్పటి వరకూ ఆ స్థానం ఖాళీగానే ఉంది. దీంతో కరీంనగర్‌ అధికారి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. విధులకు పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నారు. ఫలితంగా చిన్నారులు కొవ్వు పదార్థాలు తీసుకుంటూ అనారోగ్యంబారిన పడుతున్నారు. 

నిబంధనలు బేఖాతర్‌
పాఠశాల ప్రాంగణ పరిసరాల్లో తినుబండారాలు అమ్మకూడదనే నిబంధన ఎక్కడా అమలు కావడంలేదు. గతంలో ప్రచారాన్ని చేపట్టి ఆయా ప్రాంతాల్లో నిషేధించాలని భారత ఆహార భద్రత, ప్రమాణాల నియంత్రణ సంస్థ స్పష్టంగా కోరింది. అప్పట్లోనే కొవ్వు, ఉప్పు, చక్కెర కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవడంతో కలిగే అనర్థాలపై కొన్ని కీలక ప్రతిపాదనలు కూడా చేసింది. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్, రెగ్యులేషన్‌ 2019 ముసాయిదాలో ఆ పదార్ధాలను ప్రచారం చేయరాదని, వీటితో ఊబకాయం, డయాబెటీస్, క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని పేర్కొంది. అయినా ఈ నిబంధనలు పూర్తిస్థాయిలో ఎక్కడా అమలు కావడం లేదు. 

తల్లిదండ్రులు ఇంటి వద్ద నుంచే పంపాలి
పాఠశాలలకు సమీపంలో ఉండే దుకాణాల్లో కొనుగోలు చేసి తినే అలవాటున్న పిల్లలకు తల్లిదండ్రులు ఇంటి వద్ద నుంచే తయారు చేసిన అల్పాహారాన్ని పంపాలి. ఇలా నిత్యం అలవాటు చేస్తే పిల్లలు వాటిజోలికి వెల్లరు. ఇందుకు తల్లిదండ్రులు ప్రత్యేక చొరవ తీసుకోవాలి. జంక్‌ ఫుడ్‌ తినకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.  

అనారోగ్య సమస్యలు 
రంగు, రుచి కోసం, ఎక్కువకాలం నిల్వ ఉంచడానికి వివిధ రసాయనాలు వాడతారు. కొవ్వు సంబంధించిన ఆహార పదార్ధాలు తీసుకోవడంతో అనేక అనర్థాలు వస్తాయి. వాటిలో చక్కెర, ఉప్పు అధికంగా ఉంటుంది. దీంతో ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, అల్సర్, కడుపునొప్పి, నిద్రలేమి తదితర ఇబ్బందులు అధికంగా ఉంటాయి. పిల్లలు ఏ పని సరిగా చేయలేరు. చిరాకుతో నిరుత్సాహంగా ఉంటారు. పిల్లలు జంక్‌ ఫుఢ్‌ తీసుకోకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. 
– డాక్టర్‌ ప్రణీత్‌. పిల్లల వైద్య నిపుణులు 

పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు
నాసిరకంగా తయారు చేసిన తిను బండారాలతో పిల్లల ఆరోగ్యం పాడవుతుంది. ఇంటివద్ద నుంచి పాఠశాలకు అల్పాహారం, పండ్లు పంపినా గానీ పిల్లలు అప్పుడప్పుడు షాపుల్లోని తినుబండారాలు తింటున్నారు. దాంతో అనారోగ్యానికి గురవుతున్నారు. నీరసంగా తయారవుతున్నారు. తినుబండారాలు తయారు చేసే ఫ్యాక్టరీలపై మున్సిపల్‌ అధికారులు, ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్లు తరుచూ తనిఖీలు చేయాలి. పాఠశాలలకు సమీపంలోని దుకాణాలను పర్యవేక్షించాలి. 
– పుట్ట రవి, పెద్దపల్లి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement