ఇస్లాంకు, ఉగ్రవాదానికి సంబంధం లేదు | Sakshi
Sakshi News home page

ఇస్లాంకు, ఉగ్రవాదానికి సంబంధం లేదు

Published Fri, Feb 16 2018 1:49 AM

Islam is not associated with terrorism - Sakshi

సాక్షి హైదరాబాద్‌: ‘‘భారత్‌తో ఇరాన్‌కు శతాబ్దాలుగా సత్సంబం«ధాలున్నాయి. ప్రత్యేకంగా హైదరాబాద్‌ ప్రజలతో ఇరానీల సంబంధాలు ఇప్పటికీ కొసాగుతున్నాయి. ఇరానీలు ఇక్కడ శతాబ్దాలుగా ఉంటున్నారు. ఎంతో చారిత్రక ప్రాముఖ్యమున్న నగరం హైదరాబాద్‌. అందుకే నా భారత పర్యటనను ఇక్కడి నుంచే ప్రారంభించాను’’అని ఇరాన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ హసన్‌ రౌహనీ పేర్కొన్నారు. అనేకానేక మతాల, కులాలు, వర్గాలు వేల ఏళ్లుగా ప్రేమానురాగాలతో శాంతియుతంగా జీవిస్తున్న భారత్‌ ఓ మ్యూజియం వదంటిదని కితాబిచ్చారు. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతమే తన పర్యటన లక్ష్యమని చెప్పారు. గురువారం హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన ఆయన షియా, సున్నీ ఉలేమాలు, విద్యావేత్తలు, మేధావులు, వర్సిటీల కులపతులు తదితరులతో సమావేశమయ్యారు. ఇస్లాం ముసుగులో ఉగ్రవాదానికి పాల్పడుతున్న వారికి ఇస్లాంతో ఎలాంటి సంబంధమూ లేదని స్పష్టం చేశారు. ‘‘ఇస్లాం ఎన్నడూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించలేదు. ఇస్లాం అంటేనే శాంతి, సామరస్యం, సోదరభావం’’ అని అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా గళం విప్పిన దేశాల్లో ఇరాన్‌ ఎన్నడూ ముందే ఉందన్నారు. పాశ్చాత్య దేశాలు కొత్త రూపాల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని రౌహనీ ఆరోపించారు.

‘‘అందుకే ఇరాక్, సిరియా తదితర దేశాల్లో ముస్లిం సముదాయంపై దాడులు పెరిగాయి. ఇలాంటి నరమేధాన్ని ఇరాన్‌ ఖండిస్తుంది’’అన్నారు. పాశ్చాత్య దేశాలను దీటుగా ఎదిరించడానికి ఇస్లామిక్‌ దేశాలు ఒక్కటవాలని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా షియాలు, సున్నీలు ఐకమత్యంతో ఉండాలన్నారు. ముస్లిం సముదాయాన్ని ఏ లక్ష్యంతో సృష్టించాడో నేడు మనం మరిచిపోయామని అభిప్రాయపడ్డారు. సెల్‌ ఫోన్‌తో కుటుంబ వ్యవస్థ ఛిద్రమవుతోందని ఆవేదన వెలిబుచ్చారు. టెక్నాలజీని మంచి కోసం వాడాలన్నారు. కార్యక్రమంలో ఇరాన్‌ విదేశాంగ మంత్రి జవాద్‌ జరీస్, అధ్యక్షుని సలహాదారు ముహ్మద్‌ వాయిజ్, స్థానిక ఇరాన్‌ కాన్సులేట్‌ అధికారులు పాల్గొన్నారు.   ఇరాన్‌ అధ్యక్షుడికి ఘన స్వాగతం  అంతకుముందు హసన్‌ రౌహనీకి బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్, కేంద్ర మంత్రి ఆర్పీ సింగ్‌ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement