యాదగిరీశుడికి పెరిగిన ఆదాయం  | Increased the income for Yadagirigutta | Sakshi
Sakshi News home page

యాదగిరీశుడికి పెరిగిన ఆదాయం 

Apr 13 2019 3:16 AM | Updated on Apr 13 2019 3:16 AM

Increased the income for Yadagirigutta - Sakshi

సాక్షి, యాదాద్రి: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆదాయం గణనీయంగా పెరిగింది. మునుపెన్నడూ లేని విధంగా 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.5.6 కోట్లపై చిలుకు ఆదా యం పెరిగింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత యాదాద్రి ఆలయం అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. రూ.2,000 కోట్ల నిధులతో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం తుది దశకు చేరుకున్న రాతి కట్టడాలతో ఆలయం భక్తులను అమితంగా ఆకట్టుకుంటోంది. దీంతో భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. యాదాద్రి అభివృద్ధి పనులు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పర్యవేక్షణలో జరుగుతున్నాయి.

ఆయన పలుమార్లు యాదాద్రికి వచ్చారు. గవర్నర్‌ నరసింహన్‌తోపాటు పలువురు ప్రముఖులు యాదాద్రికి వచ్చి ఇక్కడ జరుగుతున్న పనులను అభినందించారు. గర్భాలయం పునురుద్ధరణ పనులు జరుగుతున్నందున స్వామి వారి నిజదర్శనం నిలిపివేశారు. బాలాలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ప్రధానాలయం పనులు పూర్తి కావస్తున్న తరుణంలో భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2013–14లో రూ. 63 కోట్ల ఆదాయం రాగా అది 2018–19 నాటికి రూ.99.57 కోట్లకు చేరుకుంది. 2017–18లో రూ.93.96 కోట్లు వచ్చింది.

గతేడాది కంటే భారీ స్థాయిలో ఆదాయం పెరగడం విశేషం. హుండీ, సత్యనారాయణస్వామి వ్రతాలు, అతిశీఘ్ర దర్శనం, వీఐపీ దర్శనం, ప్రసాద విక్రయాలు, ఇతర రూపంలో ఆదాయం పెరిగింది. మరికొన్ని నెలల్లో ప్రధానాలయం పూర్తయితే లక్షల్లో భక్తులు స్వామి వారి దర్శనానికి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో ఆదాయం మరింత పెరుగుతుందని దేవస్థానం అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement