‘ఐ విల్‌ ఓట్‌.. బికాస్‌ ఐ లవ్‌ నిర్మల్‌’ ప్రచార సెల్ఫి బోర్డు

I Will Vote Because I Love Nirmal - Sakshi

అంచనాలు మించిన ఓటింగ్‌ 

రికార్డుస్థాయిలో 80శాతం పైగా నమోదు 

ముథోల్‌లో అత్యధికం.. ఖానాపూర్‌లో మోస్తరు 

ప్రజాస్వామ్యాన్ని గెలిపించిన పల్లెలు 

పర్వాలేదనిపించిన పట్టణాలు 

గల్లంతైన పట్టణ ఓట్లు 

ఓటు విలువను చాటిన గిరిజనులు

సాక్షి, నిర్మల్‌: ఎప్పటిలాగే ఇప్పుడూ ఓటేసిండ్రు. కానీ.. ఈసారి గత రికార్డులు బద్దలు కొట్టేసిండ్రు. ఎన్నికల్లో ఏ అభ్యర్థి గెలుస్తారో.. మరో రెండు రోజుల తర్వాత తెలుస్తుంది. కానీ.. జిల్లాలో శుక్రవారం నమోదైన పోలింగ్‌ శాతంతో ఓటరన్న మా త్రం గెలిసిండు. అంతేకాదు.. ప్రజాస్వామ్యాన్ని గెలిపించిండు. జిల్లా అధికారు లు పడ్డ శ్రమకు తగ్గట్లుగా ఫలితం వచ్చింది. జిల్లాలో ఈసారి ఎన్నికల్లో 80శాతానికిపైగా పోలింగ్‌ నమోదు కావడం విశేషం. గత ఎన్నికల్లో 74శాతం మాత్రమే నమోదైంది. నాలుగున్నరేళ్ల తరువాత జరిగిన జిల్లా ఓటర్లు అధికారుల అంచనాలకు దగ్గరగా వచ్చారు. ఈ సారి 90శాతం ఓటింగ్‌ లక్ష్యంగా అధికారులు పనిచేశారు. ఈ క్రమంలో గత ఎన్నికలను మించి ఓటింగ్‌ శాతం నమోదైంది.  

స్వచ్ఛందంగా వచ్చి... 
పొద్దున 7గంటలకే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు. ఏ పార్టీ అభ్యర్థులు, నాయకులు చెబితేనో తాము రాలేదని.. తమ హక్కును వినియోగించుకునేందుకే వచ్చామని అధిక సంఖ్యలో ఓటర్లు పేర్కొన్నారు. గతంతో పోలిస్తే ఈ సారి ఎన్నికల్లో ఓటర్ల తీరు మారినట్లు కనిపించింది. సామాజిక మాధ్యమాలు, మీడియా, అధికారులు చేసిన ప్రచారం ప్రభావం చూపించింది. అధిక శాతం ఓటర్లు స్వచ్ఛందంగానే వచ్చి ఓటు వేసి వెళ్లారు. ఈవీఎంలు మొరాయించినా.. క్యూ లైన్లు భారీగా ఉన్నా.. గంటల పాటు ఓపికతో నిల్చుని ఓటు వేశారు. సాధారణ ఓటర్లతో పాటు దివ్యాం గ ఓటర్లు కూడా పోలింగ్‌ కేంద్రాలకు తరలిరావడం గమనార్హం. ఎన్నికల అధికారులు పోలింగ్‌ కేంద్రాలకు వారిని తీసుకురావడానికి ప్రత్యేకంగా వాహన సౌకర్యాన్ని, వీల్‌చైర్లను ఏర్పాటు చేసింది. కొంతమంది దివ్యాంగులు వీటిని ఉపయోగించుకున్నారు. చాలామంది స్వతహాగా పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేసి వెళ్లారు. 

పల్లెలు ఆదర్శం.
ప్రజాస్వామ్యం కలిపించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడంలో పల్లె ఓటర్లు ఆదర్శంగా నిలిచారు. పట్టణ ప్రాంతాల కంటే జిల్లాలోని పల్లెలలోనే పోలింగ్‌ శాతం అధికంగా నమోదైంది. పలు గ్రామాల్లో 95శాతానికిపైగా పోలింగ్‌ నమోదైంది. దాదాపు ప్రతీ గ్రామంలో 75శాతానికిపైగా పోలింగ్‌ నమోదు కావడం విశేషం. పట్టణాల్లో మాత్రం చాలా పోలింగ్‌స్టేషన్లలో గత ఎన్నికలతో పోలిస్తే పోలింగ్‌ శాతం పెరిగింది. కానీ చాలా పోలింగ్‌స్టేషన్లలో 70శాతంలోపు పోలింగ్‌ కావడం కనిపించింది. ఇక ఖానాపూర్‌ నియోజకవర్గంలోని కడెం, పెంబి, దస్తురాబాద్, ఖానాపూర్, ఉట్నూర్, ఇంద్రవెల్లి, జన్నారం, సిరికొండ, నిర్మల్‌ నియోజకవర్గంలోని మామడ, దిలావర్‌పూర్, నర్సాపూర్‌(జి), ముథోల్‌ నియోజకవర్గంలోని కుభీర్, తానూర్‌ తదితర మండలాల్లో ఇబ్బందికమైన పరిస్థితులను దాటుకోని పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. సాయంత్రం వరకు వరసల్లో నిల్చుని ఓటు వేసి వెళ్లారు. 

లేచింది మహిళాలోకం.. 
స్త్రీ,పురుష జనాభా నిష్పత్తి అధికంగా గల జిల్లాగా పేరున్న నిర్మల్‌లో ఎన్నికల్లోనూ మహిళాలోకం ఓటెత్తింది. ఉదయం 7గంటల నుంచి సాయం త్రం 5గంటల వరకు జిల్లాలోని ఏ పోలింగ్‌ స్టేషన్‌ల్లో చూసిన మహిళ ఓటర్లే ఎక్కువగా కనిపించారు. ఓపికగా వచ్చి గంటల పాటు వేచి ఉండి మరీ మహిళామణులు ఓట్లు వేసి వెళ్లారు. నిర్మల్‌ నియోజకవర్గంలో మొత్తం మహిళ ఓటర్లు 1,14,178 మంది ఉండగా 95,375మంది మహిళలు ఓట్లు వేశారు. అలాగే ముథోల్‌ నియోజకవర్గంలో మొత్తం 1,10,705మంది ఓటర్లు ఉండగా శుక్రవారం 94,027మంది ఓటర్లు వేశారు. ఖానాపూర్‌ నియోజకవర్గంలో మొత్తం మహిళ ఓటర్లు 94,944 ఉండగా 79,836మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా మొత్తంలో 3,19,827 మహిళ ఓటర్లు ఉండగా, 2,69,238 మంది ఓటు వేశారు. జిల్లాలో భైంసా, నిర్మల్, ఖానాపూర్‌లో ప్రత్యేకంగా పూర్తిగా మహిళ సిబ్బందితో మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలనూ ఏర్పాటు చేశారు. గర్భిణులు, బాలింతలు, వృద్ధుల కోసం అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.  

శ్రమకు తగ్గ ఫలితం... 
గత మూడు నెలలుగా జిల్లా అధికారులు చేసిన కృషికి తగ్గట్లుగా పోలింగ్‌ శాతం నమోదైంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ప్రశాంతి, జిల్లా సహాయ ఎన్నికల అధికారి, జేసీ భాస్కర్‌రావుతో పాటు రిటర్నింగ్‌ అధికారులు, వివిధ స్థాయిల అధికారులు, సిబ్బంది నిర్విరామంగా శ్రమించారు. మూడు నెలలుగా ఓటర్ల నమోదు, పరిశీలన, జాబితాలను విడుదల, మళ్లీ ఓటర్ల నమోదుకు అవకాశం, వీటిపై అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. అలాగే ఈవీఎంలు, వీవీ ప్యా ట్లపై పోలింగ్‌ బూత్‌ స్థాయి నుంచి ఓటర్లకు అవగాహన కల్పించారు. పల్లె ఓటర్లకు అర్థమయ్యేలా సాంస్కృతిక బృందాల ద్వారా కళాజాత కార్యక్రమాలనూ చేపట్టారు. జిల్లా కేంద్రంలో కలెక్టర్, జేసీ, ఎస్పీ, వివిధ శాఖల ఉన్నతాధికారులందరూ పాల్గొని రన్‌ ఫర్‌ ఓట్, వాక్‌ ఫర్‌ ఓట్‌ కార్యక్రమాలను నిర్వహించారు. ప్రత్యేకంగా జిల్లా కేంద్రంలో ‘ఐ విల్‌ ఓట్‌.. బికాస్‌ ఐ లవ్‌ నిర్మల్‌’ అనే ప్రచార సెల్ఫీ బోర్డులను సైతం ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా కలెక్టర్‌ ప్రశాంతి, జేసీ భాస్కర్‌రావు ఈ సారి జిల్లాలో ఓటింగ్‌ శాతం 90కి పెంచాలన్న లక్ష్యంతో పనిచేశారు. వీరితో పాటు ఎన్నికలు ప్రశాంతంగా పూర్తి కావడానికి ఎస్పీ శశిధర్‌రాజు ఆధ్వర్యంలో భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ క్రమంలో సమష్టి కృషితో 80.52 శాతానికి పైగా పోలింగ్‌ నమోదు కావడంలో సఫలమయ్యారు. 

గల్లంతు కావడంతోనే... 
జిల్లాలో అధికారులు నిర్ణయించుకున్న 90శాతం లక్ష్యాన్ని చేరుకునే అవకాశం కూడా ఉండింది. కా నీ.. వందలాది ఓట్లు గల్లంతు కావడమే ఈ లక్ష్యా న్ని చేరుకోలేకపోవడానికి కారణమైంది. నిర్మల్, ఖానాపూర్, ముథోల్‌ మూడు నియోజకవర్గాల్లో వందల సంఖ్యలో ఓట్లు జాబితాల్లో నుంచి గల్లంతయ్యాయి. ఇందులో ప్రతీ ఎన్నికల్లో క్రమం తప్పకుండా ఓటు వేసే ఓటర్లవే ఉండటం గమనార్హం. 25 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఓటర్ల పేర్లే కనిపించకుండా పోయాయి. ప్రధానంగా పట్టణాలైన నిర్మల్, భైంసాలో వందల సంఖ్యలో ఓట్లు కనిపించలేదు. ఖానాపూర్‌ నియోజకవర్గం లోని పలు గ్రామాల్లో కూడా గల్లంతయ్యాయి. ఆ యా చోట్ల సంబంధిత ఓటర్లు రెవెన్యూ అధికారు ల వద్దకు వెళ్లినప్పటికీ ప్రయోజనం లేకుండా పో యింది. తమ వద్ద గత ఎన్నికల్లో ఇచ్చిన ఓటర్‌ కా ర్డు ఉన్నప్పటికీ ఈ ఎన్నికల్లో ఓటు లేకపోవడం ఏంటని చాలా మంది ప్రశ్నించారు. ఎలాగూ జాబితాలో ఉంటుంది కదా.. అన్న నమ్మకంతో పోలిం గ్‌ కేంద్రాలకు వెళ్తే ఓటు లేకపోవడం విస్మయం కలిగించిందని వారు వాపోయారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు సైతం చర్చించారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది లోపాలతోనే చాలా వరకు ఓట్లు గల్లంతైనట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top