ప్రణయ్‌ మా కళ్లలోనే ఉన్నాడు..

Hyderabad Couple Talk To Pranay Murder Case Nalgonda - Sakshi

మిర్యాలగూడ అర్బన్‌ : ఇటీవల నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో దారుణ హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్‌ తమకు కలలోకి వస్తున్నాడని, ప్రణయ్‌ ఆత్మ ఇంకా ఇక్కడే ఉందని ఆదివారం ప్రణయ్‌ ఇంటికి వచ్చిన హైదరాబాద్‌ దంపతులను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రణయ్‌ తండ్రి బాలస్వామి, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్‌ పటాన్‌చెర్వుకు చెందిన నాగారా వు, సత్యప్రియ దంపతులు ఆదివారం తమ పిల్లలతో కలిసి మిర్యాలగూడలోని ముత్తిరెడ్డికుంటలో ఉన్న ప్రణయ్‌ నివాసానికి వచ్చారు. తాము కూడా షెడ్యూల్డ్‌ కులానికి చెందిన వారమే అని, ప్రణయ్‌ ఆత్మ తమకు కలలోకి వస్తున్నాడని చెప్పి ప్రార్ధన చేశారు.

అనంతరం ముందుగా ప్రణయ్‌ తల్లి, తండ్రులతో ప్రణయ్, మారుతీరావులు గత జన్మలో శత్రువులనీ, గత జన్మలో కోపాన్ని ఈ జన్మలో మారుతీరావు తీర్చుకున్నాడని వారితో చెప్పారు. అంతే కాకుండా ప్రణయ్‌ ఆత్మ ఇంకా ఇక్కడే తిరుగుతుందని, ప్రణయ్‌ ఆత్మ తమతో మాట్లాడుతుందని, మీతో కూడా మాట్లాడిస్తామని వారితో చెప్పడంతో అనుమానం వచ్చిన ప్రణయ్‌ తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. ప్రణయ్‌ భార్య అమృతతో ఒంటరిగా మాట్లాడాలని వారు చెప్పడంతో అందుకు ఒప్పుకోలేదు. ప్రణయ్‌ గురించిన కొన్ని విషయాలు అమృతకు చెప్పాలని అనడంతో మాట్లాడటానికి ఒప్పుకున్నారు. అనంతరం ఆ దంపతులు ప్రణయ్‌ భార్య అమృతతో మాట్లాడుతూ ప్రణయ్‌ ఆత్మ నీ కోసం ఏడుస్తుందని, నీ కోసం ప్రణయ్‌ ఎదురుచూస్తున్నాడని చెప్పారు. ఈలోగా ప్రణయ్‌ ఇంటికి చేరుకున్న వన్‌టౌన్‌ పోలీసులు వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

అన్ని కోణాల్లో విచారణ.. 
దంపతుల వివరాలను సేకరించే పనిలో పోలీసులున్నారు. ఆ ఇద్దరు దంపతులలో నాగరావు అనే వ్యక్తి కారుడ్రైవర్‌గా పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వారు ఎందుకోసం ఇక్కడికి వచ్చారు, ఎవరైనా పంపించారా..? అనే కోణంలో విచారిస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాస్‌ తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top