కార్తీక్‌రెడ్డి అప్పీల్‌ కొట్టివేత   | High Court clarifications Karthik Reddy issue | Sakshi
Sakshi News home page

కార్తీక్‌రెడ్డి అప్పీల్‌ కొట్టివేత  

Nov 5 2017 3:06 AM | Updated on Aug 31 2018 8:34 PM

 High Court clarifications Karthik Reddy issue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–1 మెయిన్స్‌లో కొన్ని పేపర్లు రాయలేదన్న కారణంతో తనను టీఎస్‌పీఎస్సీ ఇంటర్వ్యూలకు అనుమతించకపోవడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయడంపై కార్తీక్‌రెడ్డి అనే వ్యక్తి హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయమూర్తులు జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్, జస్టిస్‌ మంతోజ్‌ గంగారావుల ధర్మాసనం అప్పీల్‌ను కొట్టివేసింది. మెయిన్స్‌లో కొన్ని పేపర్లు రాయనందుకు కార్తీక్‌రెడ్డిని ఇంటర్వ్యూలకు టీఎస్‌పీఎస్సీ అనుమతించలేదు. దీనిపై హైకోర్టులో అతను పిటిషన్‌ దాఖలు చేయగా.. ఇంటర్వ్యూలకు అనుమతించడంతో పాటు ఓ పోస్టును ఖాళీగా ఉంచాలని జూలైలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఆ ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ టీఎస్‌పీఎస్సీ ఓ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంతో పాటు కార్తీక్‌రెడ్డి దాఖలు చేసిన ప్రధాన వ్యాజ్యంపై విచారణ జరిపింది. కార్తీక్‌రెడ్డి పిటిషన్‌ను కొట్టివేస్తూ సెప్టెంబర్‌ 21న సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ధర్మాసనం ముందు కార్తీక్‌రెడ్డి అప్పీల్‌ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. మెయిన్స్‌లో అన్ని పేపర్లు రాసి, ఇంటర్వ్యూలకు హాజరైన వారే గ్రూప్‌–1 పోస్టుల భర్తీకి అర్హులంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును టీఎస్‌పీఎస్సీ తరఫు న్యాయవాది డి.బాలకిషన్‌రావు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ తీర్పును పరిగణనలోకి తీసుకుని కార్తీక్‌రెడ్డి అప్పీల్‌ను ధర్మాసనం కొట్టివేసింది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement