గురుకులాల నోటిఫికేషన్‌

Gurukulam Notification Released For 5th Class Entrance - Sakshi

ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌ గురుకులాల్లో ఐదో తరగతికి మాత్రమే 

నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ 

వచ్చే నెల 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ 

దరఖాస్తు రుసుము రూ.100.. ఏప్రిల్‌ 7న ప్రవేశ పరీక్ష 

616 గురుకులాల్లో ఐదో తరగతి సీట్లు 49,280 

మైనార్టీ గురుకులాలకు త్వరలో నోటిఫికేషన్‌

సాక్షి, హైదరాబాద్‌: సాంఘిక సంక్షేమ గురు కుల పాఠశాలల్లో ఐదో తరగతి ప్రవేశాల నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈనెల 18వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలు, విద్యాశాఖ పరిధిలో 497 గురుకుల పాఠశాలలు కొనసాగుతున్నాయి. 2019–20 విద్యా సంవత్సరంలో బీసీ సంక్షేమ శాఖ పరిధిలో అదనంగా 119 గురుకుల పాఠశాలలు తెరిచేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈనేపథ్యంలో నాలుగు సొసైటీల పరిధిలో 616 గురుకుల పాఠశాలలు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో గురుకుల పాఠశాలలో ఐదో తరగతి కింద 80మందికి ప్రవేశాలు కల్పించనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని గురుకులాల్లో కలిపి 49,280 సీట్లు భర్తీ చేయనున్నారు. 

ధరఖాస్తు రుసుం రెట్టింపు: గురుకుల పాఠశాలలో ప్రవేశానికి సంబంధించిన దరఖాస్తును ఆన్‌లైన్‌లో పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇందుకు సమీపంలోని మీ–సేవా కేంద్రాలు లేదా ఇంటర్నెట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమర్పణ సమయంలోనే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ఈసారి దరఖాస్తు రుసుమును ప్రభుత్వం రెట్టింపు చేసింది. గతేడాది దరఖాస్తు రూ.50 ఉండగా.. ఈసారి ఆ మొత్తాన్ని రూ.100కు పెంచారు. ఈనెల 18వ తేదీనుంచి మార్చి 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. ప్రతి దరఖాస్తుదారుడు తన ఆధార్‌ వివరాల్ని కచ్చితంగా పొందుపరచాల్సిందే. ఏప్రిల్‌ 7వ తేదీన అర్హత పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు పరీక్ష జరగనుంది. దరఖాస్తుకు సంబంధించి సందేహాల నివృత్తి, గురుకుల పాఠశాలలకు సంబంధించిన సమాచారం కోసం హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1800–425–45678 నంబర్‌లో.. లేదా  http://tswreis.in, http://tresidential. cgg.gov.in, http://tgtwgurukulam. telangana.gov.in, http://mjptb cwreis.cgg.gov.in, http://tgcet.cgg. gov.in వెబ్‌సైట్‌లను చూడాలని సెట్‌ చీఫ్‌ కన్వీనర్‌ ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. 

 మైనార్టీల్లో ప్రత్యేకం 
ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, విద్యాశాఖ సొసైటీల్లోని గురుకుల పాఠశాలల్లో ఐదోతరగతి సీట్లభర్తీకి మాత్రమే నోటిఫికేషన్‌ ఇచ్చారు. మైనార్టీ గురుకుల పాఠశాలలకోసం ప్రత్యేక నియామక నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. అదేవిధంగా అన్ని గురుకుల సొసైటీల్లో 6 నుంచి 10వ తరగతి వరకున్న ఖాళీల భర్తీకి కూడా ప్రత్యేక నోటిఫికేషన్లు ఇస్తారు. వీటి భర్తీ ఈ విద్యాసంవత్సరం ముగిసిన తర్వాత ఏర్పడే ఖాళీలపై ఆధారపడి ఉంటుంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top