ఉధృతంగా ‘పింఛన్‌’ పోరు

Govt Teachers Protest For CPS Cancelled Medak - Sakshi

మెదక్‌ జోన్‌: సీపీఎస్‌ విధానం రద్దు చేయాలనే డిమాండ్‌తో సెప్టెంబర్‌ 1ని పెన్షన్‌ విద్రోహ దినంగా ప్రకటిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చేపట్టిన పోరు ఉధృతంగా కొనసాగింది. ఈ మేరకు శనివారం చీకటి దినంగా పాటించారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఒకరోజు సామూహిక సెలవుపెట్టి ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. అయితే టీఎన్జీఓ నాయకులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసనలో పాల్గొన్నారు. ఆందోళనకారులు ధర్నాలు, నిరసనలతో జిల్లా కేంద్రం దద్దరిల్లింది. మెదక్‌ పట్టణంలోని చిల్డ్రన్‌ పార్కు వద్ద నుండి ఉద్యోగ, ఉపాధ్యాయులు కలెక్టరెట్‌ వరకు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరెట్‌ను ముట్టడించి, సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్‌ ధర్మారెడ్డికి అందజేశారు.

జాక్టో, యూఎస్‌పీసీ, టీటీజేఏసీ, టీఎన్జీఓఎస్‌ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు నల్లబ్యాడ్జిలు ధరించి పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ లోపభూయిష్టమైన సీపీఎస్‌ విధానాన్ని వెంటనే రద్దుచేసి ఉద్యోగ, ఉపాధ్యాయులకు భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కొండల్‌రెడ్డి, జాక్టో నాయకులు శ్రీనివాస్, ప్రణీత్, సత్యనారాయణ, యూఎస్‌టీసీ నాయకులు పద్మారావు, రమేష్, హీరాలాల్, టీఎన్జీఓ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్యాంరావు, నరెందర్, అసోమెట్‌ అధ్యక్షుడు భూపాల్‌రెడ్డి, జానకిరాం, మనోహర్, చిరంజీవి, టీపీజేఏసీ చైర్మన్‌ రాందాస్, ప్రధాన కార్యదర్శి దత్తత్రేయ కులకర్ణి, టీపీయూఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హన్మంతరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాంలు, ఎస్టీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవేందర్, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, శ్రీనివాస్‌రావు  పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top