‘నయీమ్ భూముల’కు కంచె | Gangster nayeem Lands to Fence! | Sakshi
Sakshi News home page

‘నయీమ్ భూముల’కు కంచె

Sep 9 2016 1:20 AM | Updated on Sep 4 2017 12:41 PM

గ్యాంగ్‌స్టర్ నయీమ్ చెరలో ఉన్న భూములను స్వాధీనం చేసుకునే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ చెరలో ఉన్న భూములను స్వాధీనం చేసుకునే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా చాలాప్రాంతాల్లో నయీమ్ పెద్దఎత్తున స్థలాలను కబ్జాలో పెట్టుకున్నాడు. కొన్నిచోట్ల సొంతదారులను చంపుతానని బెదిరించి తక్కువధరకే కొనుగోలు చేయగా, మరికొన్ని చోట్ల నయాపైసా ఇవ్వకుండా ఆక్రమించాడు. ఈ కోవలో కొన్నిప్రాంతాల్లో ప్రభుత్వ భూములనూ స్వాహా చేశాడు. దీనికి రాజకీయ నేతలు, పోలీసు, రెవెన్యూ అధికారులు నయీమ్‌కు సహకరించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. సిట్ దర్యాప్తులో దాదాపు 1,500 ఎకరాల భూములకు సంబంధించిన పత్రాలను గుర్తించింది. నయీమ్ కుటుంబసభ్యుల పేరునే దాదాపు 800 ఎకరాలున్నట్టు సమాచారం.

దర్యాప్తు కొనసాగుతున్నందున మరిన్ని భూముల వివరాలు వెలుగు చూసే అవకాశముంది. నయీమ్ కబ్జా చేసిన భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి చట్టపరంగా ఉన్న ఇబ్బందులను పరిశీలించాల్సిందిగా న్యాయశాఖను ఆదేశించినట్టు తెలిసింది. రెవెన్యూ అధికారులు కూడా ఆ భూముల వివరాలపై ఆరా తీస్తున్నారు. వీటిలో ప్రభుత్వ భూములను నేరుగా స్వాధీనం చేసుకోనుండగా, పట్టా భూముల విషయంలో అనుసరించాల్సిన పద్ధతులపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
 
రెండు పడక గదుల ఇళ్లకు
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తున్న రెండు పడకగదుల ఇళ్ల పథకం ఇంకా ముందుకు కదలటంలేదు. ఒకటి, రెండుచోట్ల మినహా ఎక్కడా ఇళ్ల నిర్మాణం మొదలు కాలేదు. దీనికి స్థలాల కొరత ఉంది. ఈ నేపథ్యంలో నయీం కబ్జాలో ఉన్న భూముల్లో రెండు పడక గదుల ఇళ్లకు యోగ్యంగా ఉన్న వాటి వివరాలను అందించాల్సిందిగా ము ఖ్యమంత్రి కార్యాలయం నుంచి రెవె న్యూ అధికారులకు ఆదేశం అందింది. స్థానిక అధికారులు ప్రస్తుతం ఆ పనిలో నిమగ్నమయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement