గురుకులంలో ఫుడ్‌ పాయిజన్‌! | Food poison in Gurukul School | Sakshi
Sakshi News home page

గురుకులంలో ఫుడ్‌ పాయిజన్‌!

Mar 26 2019 3:02 AM | Updated on Mar 26 2019 3:02 AM

Food poison in Gurukul School - Sakshi

అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులు

మెదక్‌ రూరల్‌: మెదక్‌ జిల్లాలో కలుషిత ఆహారం తిని పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. హవేళిఘణాపూర్‌ మండల కేంద్రంలో సోమవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. హవేళిఘణాపూర్‌ మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థినులు ఆదివారం రాత్రి అన్నం, చారు, బెండకాయతో భోజనం చేసి నిద్రపోయారు. సోమవారం తెల్లవారుజామున సుమారు 30 మంది విద్యార్థినులు తీవ్ర కడుపునొప్పి, విరేచనాలు, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. వారి బాగోగులు చూసే నర్సు అందుబాటులో లేకపోవడంతో అస్వస్థతకు గురైన పిల్లలను సిబ్బంది మెదక్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

వీరిలో 7, 8 వ తరగతికి చెందిన చంద్రిక, నాగవర్ష, శిరీష, మౌనిక, సంధ్య, లతిక అనే ఆరుగురు విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది రోజులుగా నాణ్యమైన ఆహారాన్ని అందించడం లేదని పలువురు విద్యార్థినులు వాపోతున్నారు. పిల్లలు అస్వస్థతకు గురైన విషయాన్ని తమకు తెలియజేయకపోవడంపై కొందరు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపాల్‌ శోభాదేవి మాట్లాడుతూ.. పాఠశాలలో మొత్తం 298 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారని, గతంలో ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు జరగలేదని అన్నారు. 

పరీక్షించిన డీఎంహెచ్‌వో.. 
చికిత్స పొందుతున్న విద్యార్థినుల నుంచి డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాల్సిందిగా వైద్యు లను ఆదేశించారు. ఫుడ్‌ పాయిజన్‌కు గల కారణాలపై విచారిస్తామన్నారు. అనంతరం పాఠశాలను సందర్శించి పరిసరాలు, విద్యార్థులుండే ప్రాంతా న్ని శుభ్రంగా ఉంచాలని సూచించారు. మండల వైద్యుడు చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో విద్యార్థినులకు పరీక్షలు చేసి మందులను అందజేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement