క్యూనెట్‌ కేసులో సెలబ్రిటీలకు నోటీసులు!

Five Hundred Celebrities In Qnet Scam - Sakshi

జాబితాలో క్రికెటర్‌ మురళీధరన్, షారుక్‌ ఖాన్, అల్లు శిరీష్, ఫూజా హెగ్డే  

500 మందికి నోటీసులు 

సాక్షి, హైదరాబాద్‌: మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ ‘క్యూనెట్‌’కేసులో సైబరాబాద్‌ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటివరకు క్యూనెట్‌ ఫ్రాంచైజీ విహన్‌ డైరెక్ట్‌ సెలింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై నమోదైన 14 కేసుల్లో దాదాపు 60 మందిని అరెస్టు చేశారు. తాజాగా ఈ సంస్థకు అంబాసిడర్లుగా వ్యవహరించిన సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. వీరిలో శ్రీలంక మాజీ క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్, సినీ రంగ ప్రముఖులు బొమన్‌ ఇరానీ, షారుక్‌ ఖాన్, అల్లు శిరీష్, పూజా హెగ్డేతో పాటు క్యూనెట్‌ కంపెనీ సీఈవోలు, డైరెక్టర్లు, షేర్‌ హోల్డర్లు, ప్రమోటర్లు, బాలీవుడ్, టాలీవుడ్‌ తారలు, క్రికెటర్లు దాదాపు 500 మంది ఉన్నారు. వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో కోరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వీరంతా గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లోని ఆర్థిక నేరాల విభాగ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలిసింది. వీరిచ్చే సమాచారం ఆధారంగా పోలీసులు తదుపరి చర్యలు చేపట్టనున్నారు.  

క్యూనెట్‌ కేసులో పోలీసుల దర్యాప్తుపై సుప్రీం కోర్టు ఎలాంటి స్టే ఆర్డర్‌ ఇవ్వలేదని సైబరాబాద్‌ పోలీసులు పేర్కొన్నారు. బెంగళూరుకు చెందిన విహన్‌ డైరెక్ట్‌ సెలింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ దాదాపు 3 లక్షల మందిని మోసగించినట్లుగా తెలుస్తోందన్నారు. దర్యాప్తు పూర్తయితే తప్ప ఎంత మందిని, ఎంత మొత్తంలో మోసం చేశారన్నదానిపై స్పష్టత వస్తుందన్నారు. ఇప్పటివరకు రూ.10 వేల కోట్లకుపైగా మోసం చేసినట్లు గుర్తించామన్నారు. జనవరి తొలి వారంలో 14 కేసుల్లో 58 మందిని అరెస్టు చేసి ఆ కంపెనీకి చెందిన బ్యాంక్‌ ఖాతాల్లోని రూ.2.7 కోట్లు ఫ్రీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత విహన్‌ డైరెక్ట్‌ కంపెనీ డైరెక్టర్‌తో పాటు మరో ఇద్దరినీ అరెస్టు చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top