బో‘ధనం’ వచ్చిందోచ్.. | fee reimbursement, scholarship released through fast scheme | Sakshi
Sakshi News home page

బో‘ధనం’ వచ్చిందోచ్..

Nov 3 2014 2:29 AM | Updated on Sep 5 2018 9:18 PM

పేద విద్యార్థుల చదువులకు లైన్ క్లియర్ అయింది. ఫీజు రీయింబర్స్‌మెంటు, స్కాలర్‌షిప్‌ల విడుదలతో కొంత ఊరట లభించింది.

ఆదిలాబాద్ రూరల్ : పేద విద్యార్థుల చదువులకు లైన్ క్లియర్ అయింది. ఫీజు రీయింబర్స్‌మెంటు, స్కాలర్‌షిప్‌ల విడుదలతో కొంత ఊరట లభించింది. తెలంగాణ విద్యార్థులకు ఫాస్ట్ పథకం ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు అందజేస్తామని చెప్పి ఇన్నాళ్లు సందిగ్ధంలో పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు 2013-14 విద్యా సంవత్సరానికి సంబంధించిన నిధులు విడుదల చేసింది.

దీంతో ఇన్ని రోజులుగా విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళనకు తెరపడింది. విద్యార్థులతోపాటు కాళాశాలల యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 15రోజుల క్రితమే రాష్ట్ర వ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.. జిల్లాల వారీగా ఎస్‌సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలకు నిధులను కేటాయిస్తూ శని వారం ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ, బీసీ, ఈబీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ కలిపి మొత్తం జిల్లాకు రూ. 8.23 కోట్లు మంజూరు చేశారు.

జిల్లాకు ఎస్సీ, బీసీ, ఈబీ సీ విద్యార్థులకు సంబంధించి 28 కోట్లు అవసరం ఉండగా మొదటి దశగా 30 శాతం నిధులను మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. మిగితావి ఒకటి లేదా రెండవ దశల్లో వచ్చే అవకాశాలున్నాయాని అధికారులు చెబుతున్నారు. 5వేల మంది ఎస్సీ విద్యార్థులకు రూ.8.02 కోట్లు అవసరం ఉండగా, ప్రస్తుతం ఆర్‌టీఎఫ్ కింద రూ.1.05 కోట్లు, ఎంటీఎఫ్ కింద రూ. 67లక్షలు మొత్తం 1.72 కోట్లు విడుదలయ్యాయి. 9వేల మంది బీసీ, ఈబీసీ విద్యార్థులకు 28.21 కోట్లు అవసరం ఉండగా, వారికి ప్రస్తుతం ఆర్‌టీఎఫ్ కింద రూ.17.31 కోట్లు అవసరం కాగా రూ.3.81 కోట్లు, ఎంటీఎఫ్ కింద రూ.10.90 కోట్లు అవసరం ఉండగా రూ. 2.70 కోట్లు విడుదల చేశారు. మొత్తం 6.51 కోట్లు మాత్రమే విడుదల చేశారు.

ఈ నిధులను జిల్లా సంక్షేమ అధికారులు మొదటగా స్వీకరించి. తర్వాత బిల్లులను ట్రెజరీకి అందజేస్తారు. వారు బిల్లులను పాస్ చేసి బ్యాంకులలో వేస్తారు. బ్యాంకు నుంచి విద్యార్థులు, కళాశాల యాజమాన్యాల ఖాతాలలో జమ అవుతాయి. ఇదంతా జరగడానికి వారం, పది రోజులు సమయం పడుతుందని అధికారులు తెలిపారు.

 15 రోజుల్లోగా విద్యార్థుల ఖాతాల్లోకి.. - అంకం శంకర్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ
 రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్ పథకం కింద విద్యార్థులకు విడుదల చేసిన నిధులను వారి ఖాతాల్లో జమ చేయడానికి 15 రోజుల వరకు సమయం పడుతుంది. ప్రస్తుతం కొంత వరకు మాత్రమే నిధులు వచ్చాయి. వచ్చిన డబ్బులను వారివారి ఖాతాల్లో జమ చేస్తాం.

Advertisement
 
Advertisement
Advertisement