
సాక్షి, హైదరాబాద్ : దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం జాతీయ స్థాయిలో రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు.. భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా వివిధ వర్గాలకు చెందిన సంఘాలు, సంస్థలు, ప్రముఖులతో వరుసగా సమావేశాలు నిర్వహించాలని ఆయన నిర్ణయించారు.
మొదట ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ వంటి అఖిల భారత సర్వీసు రిటైర్డ్ అధికారులతో భేటీ కావాలని యోచిస్తున్నారు. జాతీయ స్థాయిలో, వివిధ రాష్ట్రాలలో ఏళ్ల తరబడి ప్రభుత్వంలో పనిచేయడం, అనేక రాజకీయ పరిణామాలను చూసిన అనుభవం ఉన్న ఆలిండియా సర్వీసు అధికారులతో సమావేశమైతే.. దేశానికి కావల్సిన ఎజెండాను రూపొందించడానికి దోహదపడుతుందని కేసీఆర్ భావిస్తున్నారు.
అఖిల భారత సర్వీసు అధికారులతో సమావేశమైన తర్వాత రక్షణ శాఖ (సైనిక, వైమానిక, నౌకాదళ) మాజీ ఉన్నతాధికారులు, ఇతర ఉద్యోగులతో... దేశవ్యాప్తంగా ఉన్న న్యాయ నిపుణులు, ప్రముఖ న్యాయవాదులు, అఖిల భారత రైతు సంఘాలు, వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రిటైర్డ్ ఉద్యోగ సంఘాలతో, మీడియా సంస్థలు, జర్నలిస్టులు, పారిశ్రామికవేత్తలు, కార్మిక సంఘాల ప్రతినిధులతోనూ భేటీ కావడానికి సన్నాహాలు చేస్తున్నారు. కేంద్రం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసిన ఆర్థిక శాఖ అధికారులు, నిపుణులతోనూ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
భేటీల కోసం సమన్వయకర్తలు..
ప్రముఖులు, సంఘాలతో నిర్వహించే సమావేశాలను హైదరాబాద్, ఢిల్లీలో పాటు కోల్కతా, ముంబై, చెన్నై, బెంగుళూరు వంటి నగరాల్లోనూ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. మొత్తంగా వివిధ వర్గాల ప్రతినిధులతో వరుసగా సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు కూడా మొదలైనట్లు తెలుస్తోంది.
ఆయా వర్గాలను సంప్రదించడానికి, సమన్వయం చేయడానికి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమన్వయకర్తలను నియమించినట్లు సమాచారం. దేశం బాగుపడాలని, దేశ ప్రజలు బాగుండాలని ఆలోచించే ప్రతి ఒక్క వర్గంతో మాట్లాడటం ద్వారా.. దేశానికి అవసరమైన ఎజెండాను రూపొందించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
కేసీఆర్కు అజిత్ జోగి ఫోన్
జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై ఛత్తీస్గఢ్ మాజీ సీఎం, ఆ రాష్ట్ర జనతా కాంగ్రెస్ పార్టీ నేత అజిత్ ప్రమోద్కుమార్ జోగి కేసీఆర్తో చర్చించారు. సోమవారం సీఎం కేసీఆర్తో ఫోన్లో మాట్లాడిన ఆయన.. రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావాలన్న కేసీఆర్ ప్రకటనకు మద్దతు ప్రకటించారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయంలో సానుకూలత వ్యక్తం చేశారు. కేసీఆర్తో కలసి పనిచేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ‘గొప్ప నేతగా ఇప్పటికే నిరూపించుకున్నారు. మరోసారి గొప్ప నేతగా నిరూపించుకుంటారు’అని అజిత్ జోగి కేసీఆర్ను అభినందించినట్లు తెలిసింది.