మళ్లీ వానదెబ్బ.. | farmers got loss due to untimely rains | Sakshi
Sakshi News home page

మళ్లీ వానదెబ్బ..

May 20 2014 12:03 AM | Updated on Mar 28 2018 10:56 AM

మండల పరిధిలో సోమవారం మధ్యాహ్నం ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి అపార నష్టం వాటిల్లింది.

 కందుకూరు, న్యూస్‌లైన్: మండల పరిధిలో సోమవారం మధ్యాహ్నం ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి అపార నష్టం వాటిల్లింది. ఆకులమైలారంలో పిడుగు పాటుకు రైతు మృతి చెందగా, నేదునూరు సమీపంలోని పొలంలో రంగని బాల్‌రాజ్‌కు చెందిన ఓ ఎద్దుపై పిడుగుపడి అక్కడికక్కడే మృతిచెందింది. మహ్మద్‌నగర్‌లో ఈదురుగాలులకు ఇంటి రేకులు లేచిపోయాయి. ఆ సమయంలో ఇంట్లో ఉన్న తల్లోజి బ్రహ్మచారి స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ముచ్చర్లలో వడగళ్లు పడి వరి, కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి. ఈదురుగాలులతో గుమ్మడవెళ్లి, కందుకూరు, మీర్కాన్‌పేట, దెబ్బడగూడ, నేదునూరు, జైత్వారం, కొత్తగూడ, గూడూరు, కొత్తూర్, తదితర గ్రామాల్లో కోతకొచ్చిన వరి పంట నేలవాలగా, మామిడి కాయలు నేలరాలి నష్టం వాటిల్లింది. గుమ్మడవెళ్లి, మహ్మద్‌నగర్ గ్రామాల పరిధిలో విద్యుత్ స్థంభాలు కూలిపోగా, కొన్ని చోట్ల తీగలు తెగిపడి విద్యుత్ అంతరాయం ఏర్పడింది.

 షాబాద్‌లో..
 షాబాద్: షాబాద్ మండలంలో సోమవారం భారీ వర్షం కురిసింది. మండలంలోని నాగరకుంట. షాబాద్, కుమ్మరిగూడ. హైతాబాద్, మద్దూర్, సోలీపేట్ తదితర గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షానికి ఇళ్లు. పశువుల పాకలు దెబ్బతిన్నాయి. ఇళ్లు దెబ్బతిన్న బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

 గండేడ్‌లో..
 గండేడ్: కొనుగోలు కేంద్రంలో నిర్వాహకుల దైన్యానికి వరి ధాన్యం తడిసి ముద్దయింది. గండేడ్‌లోని కొనుగోలు కేంద్రంలో వెయ్యి బస్తాల వరి ధాన్యం సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దయింది.

 ధాన్యం కొనుగోలు చేసి తడిసి ముద్దయ్యేలా నిర్లక్ష్యంగా వ్యహరించిన అధికారుల తీరుపై రైతులు మండిపడుతున్నారు. కనీసం తాడ్‌పాలీన్ (తాడుపత్రీలు) కూడా ధాన్యంపై కప్పే దిక్కులేకుండా పోయింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రమలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంవల్లే రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్ముకునేందుకే మొగ్గుచూపుతున్నారన్నారు. ఇప్పటికైనా కొనుగోలు కేంద్రం ఉన్నతాధికారులు స్పందించి ధాన్యం తడవకుండా జాగ్రత్తలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement