సాక్షి, అమరావతి: వాయువ్య బంగాళాఖాతం, ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని.. విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రాబోయే 2-3 రోజుల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశముందని.. తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు విస్తాయని.. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. రేపు(శుక్రవారం) శ్రీకాకుళం, పోలవరం, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని.. వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గాలులకు విద్యుత్ వైర్లు తెగిపడే ప్రమాదం ఉంది.. జాగ్రత్తగా గమనిస్తూ దూరంగా ఉండాలని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.


