మహారాష్ట్రలో పూర్తిస్థాయిలో ‘నైరుతి’ ప్రభావం
ముంబై సహా రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు
మరో ఐదురోజులు కొనసాగుతాయని ఐఎండీ హెచ్చరిక
ఆరు జిల్లాలకు రెడ్అలర్ట్
సాక్షి ముంబై: ఆలస్యంగా ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ఇప్పుడు మహారాష్ట్రపై పూర్తిస్థాయిలో ప్రభావం చూపుతున్నాయి. ముంబైతో పాటు థానే, నవీ ముంబై, కల్యాణ్–డోంబివలీ, భివండి, పాల్ఘర్, రాయగడ్, కొంకణ్ ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలు సాధారణ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి.
రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ముంబైకి ఐదు రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ , రత్నగిరికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. జూలై 2న పాల్ఘర్, జూలై 3, 4 తేదీల్లో రాయగడ్, జూలై 4న థానే, జూలై 5న సతారా ఘాట్ ప్రాంతాలకు, జూలై 2 నుంచి 4 వరకు పుణే ఘాట్ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ అమల్లో ఉంటుంది. ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
కొంకణ్, మరాఠ్వాడా, పశ్చిమ మహారాష్ట్రకూ హెచ్చరిక
కొంకణ్ ప్రాంతంలోని చాలా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది. మరాఠ్వాడాలో చాలా ప్రాంతాల్లో, ఉత్తర మహారాష్ట్రలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ మహారాష్ట్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగనున్నట్లు అంచనా వేసింది.
ముంబై జలమయం.. అంధేరి సబ్వే మూసివేత
ముంబైలోని పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. అంధేరి సబ్వేలో నాలుగు నుంచి ఐదు అడుగుల మేర నీరు చేరడంతో అధికారులు వాహనాల రాకపోకలను చాల సమయం పాటు పూర్తిగా నిలిపివేశారు. జోగేశ్వరి, గోరేగావ్, మలాడ్, కాందివలి, బోరివలి, కుర్లా, ములుండ్, శాంతాక్రూజ్, బాంద్రా తదితర ప్రాంతాల్లో రహదారులపై భారీగా నీరు నిలవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
హైవేలపై భారీ ట్రాఫిక్.. లోకల్ రైళ్లకు అంతరాయం
నవీ ముంబైలోని జూయినగర్ సమీపంలో సైన్–పన్వేల్ జాతీయ రహదారిపై భారీగా నీరు చేరడంతో ముంబై వైపు వెళ్లే మార్గంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు భివండి బైపాస్ వద్ద ముంబై–నాసిక్ జాతీయ రహదారిపై కూడా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గంటల తరబడి వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి. భారీ వర్షాల ప్రభావంతో సెంట్రల్, హార్బర్ రైల్వే మార్గాల్లో లోకల్ రైళ్లు 15–20 నిమిషాలు, వెస్ట్రన్ రైల్వేలో 5–10 నిమిషాలు ఆలస్యంగా నడిచాయి. లక్షలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ములుండ్లోని బీఎంసీకి చెందిన ఎం.టి. అగర్వాల్ ఆస్పత్రి ప్రాంగణంలోకి వరద నీరు చేరడంతో రోగులు, వారి బంధువులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రైతులకు ఊరట.. ప్రజలకు అప్రమత్తత
రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తుండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఖరీఫ్ పంటల విత్తనాలు వేయడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని హర్షం వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు ముంబై మహానగర ప్రాంత ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, నీటమునిగిన రహదారుల్లో ప్రయాణించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని వాతావరణ శాఖ సూచించింది.
చదవండి: ఏసీ రైళ్లు మాకొద్దు.. ప్రయాణికులు ఫైర్
కల్యాణ్–డోంబివలీ జంట నగరాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. శిల్ఫాటా ప్రాంతంలో రహదారి పక్కన నిలిపిన కార్లు దాదాపు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. కల్యాణ్ తూర్పులోని ఆడివలి, ఢోకళి ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. భాండుప్ విలేజ్ రోడ్డులో కాలువలు పొంగిపొర్లడంతో విద్యార్థులు వరద నీటిలోనే ఇళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. థానే జిల్లాలోని భివండీ, ఉల్హాస్నగర్, అంబర్నాథ్, బద్లాపూర్, షాహాపూర్, ముర్బాడ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. వాగ్లే ఎస్టేట్లో చెట్టు కూలి ఓ వ్యక్తి గాయపడగా, పలు చోట్ల చెట్లు కూలి వాహనాలు దెబ్బతిన్నాయి. డోంబివలీ ఎంఐడీసీ ప్రాంతంలో విద్యుత్ లైన్లపై చెట్టు పడటంతో కొంతసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.


