
సమీక్షలో పాల్గొన్న ఎంపీ కవిత. చిత్రంలో మామిడి హరికృష్ణ, రమణాచారి, బుర్రా వెంకటేశం, దేశపతి శ్రీనివాస్, నందిని సిధారెడ్డి తదితరులు
సాక్షి, హైదరాబాద్: డిసెంబర్ 15 నుంచి 19 వరకు హైదరాబాద్లో నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభలకు విస్తృత ప్రచారం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విమానాలు, రైళ్లు, బస్సు ల్లో మహాసభ లోగో స్టిక్కర్లను అతికించడంతోపాటు హైదరాబాద్, ఇతర జిల్లా కేంద్రాల్లో తెలుగు కవితలు, పద్యాలను హోర్డింగ్ల ద్వారా ప్రదర్శించ నున్నారు. మహాసభల ఏర్పాట్లపై శుక్రవారం రవీంద్ర భారతిలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో నిర్ణయించారు. ప్రపంచ తెలుగు మహాసభలకు ఇతర దేశాలు, రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ముఖ్యులను ఇతర ప్రముఖులను ఆహ్వానించడం, ముఖాముఖి చర్చలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రచురణలు, సాహిత్య ప్రక్రియలు, ఆతిథ్య ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.
మహా సభలకు వార్తా పత్రికలు, ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా తగిన ప్రచారం కల్పించేందుకు సంపాదకులు, మీడియా యాజమాన్యాలతో సమావేశం నిర్వహించాలని కూడా ఈ సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. దీనితోపాటు రాష్ట్రంలో ఉన్న ప్రాచీన శాసనాలు, చారిత్రక, వారసత్వ కట్టడాల వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణా చారి, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బి. వెంకటేశం, ముఖ్యమంత్రి ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, తెలుగు విశ్వవిద్యాలయం వైస్చాన్సలర్ ఎస్.వి.సత్యనారాయణ, రాష్ట్ర గ్రంథా లయ పరిషత్ చైర్మన్ అయాచితం శ్రీధర్, సాంస్కృ తిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణలతో పాటు కోర్ కమిటీ సభ్యుల ప్రత్యేక ఆహ్వానం మేరకు నిజామా బాద్ ఎంపీ కవిత పాల్గొన్నారు.