ఉక్రెయిన్‌కి విత్తన ఎగుమతి చేస్తాం | Export the seed to Ukraine | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌కి విత్తన ఎగుమతి చేస్తాం

Dec 30 2018 3:20 AM | Updated on Dec 30 2018 3:20 AM

Export the seed to Ukraine - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విత్తనోత్పత్తికి తెలంగాణలో అనుకూల వాతావరణం ఉందని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి అన్నారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఉక్రెయిన్‌ బృందంతో శనివారం ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో మంచి వాతావరణ పరిస్థితులు, నేలలు, విత్తన ప్రాసెసింగ్‌ ప్లాంట్‌లు ఉన్నాయని ఉక్రెయిన్‌ బృందానికి తెలిపారు. ఈజిప్ట్, మయన్మార్, వియత్నాం, బంగ్లాదేశ్‌ ఇప్పటికే తెలంగాణ నుంచి విత్తనాల దిగుమతికి సుముఖత తెలిపినట్లు వివరించారు.

ఉక్రెయిన్‌ దేశంకి కూడా అంతర్జాతీయ (ఓఈసీడీ) ధ్రువీకరణ ద్వారా విత్తనాలు ఎగుమతి చేస్తామని చెప్పారు.  ఉక్రెయిన్‌లో గోధుమలు, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, చిక్కుడు ప్రధాన పంటలనీ, ఏడాదిలో ఒకే సీజన్‌ ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ఫ్రాన్స్‌ నుంచి పొద్దుతిరుగుడు దిగుమతి చేసుకుంటున్నామని, భవిష్యత్తులో తెలంగాణ నుంచి∙500 టన్నుల హైబ్రీడ్‌ పొద్దు తిరుగుడు దిగుమతి చేసుకుంటామన్నారు. సమావేశంలో ఉక్రెయిన్‌ విత్తన ప్రతినిధులు విటలి ప్లొట్కా, సెర్జీ షెవెన్‌చ్కో, తెలంగాణ విత్తన ధ్రువీకరణ అథారిటికి చెందిన భాస్కర్‌సింగ్, డిప్యూటీ డైరెక్టర్‌ జి.సుదర్శన్‌ పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement