సమర్థత, సమన్వయం, సమీకరణాలు

Expansion of Telangana Cabinet February 22 - Sakshi

మంత్రివర్గ కూర్పులో వాటినే పరిశీలిస్తున్న సీఎం

గత ప్రభుత్వంలోని సీనియర్‌ మంత్రులకు అవకాశం

కేటీఆర్, హరీశ్, కడియం, ఈటల పేర్ల పరిశీలన... ఒకరిద్దరు కొత్త వారికీ చోటు!

ఎమ్మెల్సీ, లోక్‌సభ అభ్యర్థుల జాబితాతో కలిపి కసరత్తు

బడ్జెట్‌ సమావేశాలు మొదలయ్యే లోపలే విస్తరణ పూర్తికి కేసీఆర్‌ యోచన

సాక్షి, హైదరాబాద్‌: మంత్రివర్గ విస్తరణకు ముహూ ర్తం దగ్గరపడుతోంది. ఈ నెల 22న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు మొదలయ్యేలోపే కేబినెట్‌ విస్తరణ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భావిస్తున్నారు. కేబినెట్‌లో ఎవరెవరు ఉండాలనే విషయంలో అన్ని అంశాలను పరిశీలిస్తున్నారు. లోక్‌సభ, ఎమ్మెల్సీ అభ్యర్థులు, మంత్రులను కలిపి సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. గత ప్రభుత్వంలోని మంత్రులతోపాటు కొత్త వారిని కలిపి మంత్రివర్గ కూర్పు ఉండనుంది.

ఊహించని విధంగా ఒకరిద్దరికి చోటు దక్కే అవ కాశం ఉందని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా మూడు కీలక అంశాలను ప్రాతిపదికగా చేసుకొని మంత్రివర్గ కూర్పు ఉంటుంది. పరిపాలన సమర్థత, సామాజిక సమీకరణాలు, ప్రభు త్వం–పార్టీని అనుసంధానించే నేతలతో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారు. అవినీతి ఆరోపణలకు ఆస్కారం లేకుండా పరిపాలన అంశాలపై పట్టు కలిగినవారు మంత్రివర్గంలో ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్‌ ఉన్నట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి.

నలుగురు సీనియర్లకు మళ్లీ చోటు ఖాయమే
గత ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన కేటీఆర్‌... పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్‌ శాఖలను కొత్త పుం తలు తొక్కించారు. హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి, మెట్రో రైలుతోపాటు పరిశ్రమలు, ఐటీ రంగం పురోగతిలో కేటీఆర్‌ తనదైన ముద్ర వేశారు.  కీలకమైన సాగునీటి రంగంలో మన రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. సాగునీటి మంత్రిగా తన్నీరు హరీశ్‌రావు ప్రాజెక్టుల నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు. కోటి ఎకరాలకు సాగునీరు లక్ష్యం త్వరలోనే సాకరమయ్యే పరిస్థితి నెలకొంది. విస్తృతమైన విద్యారంగంపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

పరిపాలనలో అనుభవం ఉన్న కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రిగా విద్యాశాఖపై తనదైన ముద్రవేశారు. కేసీఆర్‌కు ఉద్యమకాలం నుంచి సన్నిహితంగా ఉన్న ఈటల రాజేందర్‌ ఆర్థిక మంత్రిగా సంక్షేమ కార్యక్రమాల అమలులో కీలకంగా పని చేశారు. వీరంతా సమర్థతతోపాటు ప్రభుత్వ–పార్టీ కార్యక్రమాల సమన్వయం కనబరచడంతో సామా జిక సమీకణాలపరంగా వారికి మంత్రివర్గంలో మళ్లీ అవకాశం ఉంటుందని, మంత్రివర్గంలో మూడో వం తు మంది పాతవారే ఉంటారని... గత ప్రభుత్వంలో కీలకంగా పని చేసినవారికి మళ్లీ అవకాశం ఉంటుం దని టీఆర్‌ఎస్‌ వర్గాలు పేర్కొంటున్నారు.

సామాజిక లెక్కలు...
మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమీకరణాలు, జిల్లాలవారీగా పదవుల కేటాయింపు కీలకం కానుంది. స్వతంత్రులుగా గెలిచి పార్టీలో చేరిన వారితో కలిపి టీఆర్‌ఎస్‌కు ప్రస్తుతం 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో ఎక్కువ మంది ఒకటి కంటే ఎక్కువసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే. దీంతో ఎక్కువ మంది మంత్రి పదవులను ఆశిస్తున్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం తెలంగాణలో ముఖ్యమంత్రి కాకుండా 17 మంది మంత్రులు ఉండొచ్చు. గత ప్రభుత్వంలో 11 మంది ఓసీలు, నలుగురు బీసీలు, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మైనారిటీ మంత్రులుగా ఉన్నారు.

మైనారిటీ వర్గానికి చెందిన మహమూద్‌ అలీ ఇప్పటికే మంత్రిగా ఉన్నారు. కొత్త మంత్రివర్గంలో సామాజిక సమీకరణాలపరంగా స్వల్ప మార్పులు ఉంటాయని తెలుస్తోంది. గత అసెంబ్లీలో బీసీ వర్గానికి చెందిన మధుసూదనాచారి స్పీకర్‌గా పనిచేశారు. ప్రస్తుత శాసనసభ స్పీకర్‌గా ఓసీ సామాజిక వర్గానికి చెందిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికవడంతో ఈసారి మంత్రివర్గంలో ఈ మేరకు ఓసీల సంఖ్యను తగ్గించి బీసీల సంఖ్య పెంచేలా సీఎం కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. తాజాగా మారిన సమీకరణాల్లో కొత్త మంత్రివర్గంలో బీసీల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఎస్సీ వర్గం నుంచి ఇద్దరిని మంత్రులుగా చేర్చుకునే విషయాన్ని కేసీఆర్‌ పరిశీలిస్తున్నారు.

శాసనమండలి చైర్మన్, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ పదవుల కేటాయింపు ఆధారంగా మంత్రివర్గం తుది కూర్పుపై స్పష్టత రానుంది. సామాజిక సమీకరణాలతోపాటు ప్రతి జిల్లాకు ఒక పదవి కేటాయించేలా సీఎం కసరత్తు చేస్తున్నారు. కొత్తగా ఏర్పాటవుతున్న రెండింటితో కలిపి 33 జిల్లాలకు కచ్చితంగా ప్రాతినిధ్యం ఉండేలా పదవుల పంపకం ఉండనుంది. 17 మంది మంత్రులు, శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, శాసనమండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్‌తోపాటు రెండు చట్ట సభల్లో చీఫ్‌ విప్, విప్‌లు, పార్లమెంటరీ కార్యదర్శుల పదవులను పరిగణనలోకి తీసుకొని జిల్లాలవారీగా కేటాయింపులు జరపాలని కేసీఆర్‌ భావిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top