అన్ని ఆసుపత్రుల్లోనూ ‘ఆక్సిజన్‌’ తప్పనిసరి  | Etela Rajender Speaks Respiratory problems In Telangana | Sakshi
Sakshi News home page

అన్ని ఆసుపత్రుల్లోనూ ‘ఆక్సిజన్‌’ తప్పనిసరి 

May 20 2020 5:17 AM | Updated on May 20 2020 5:17 AM

Etela Rajender Speaks Respiratory problems In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వల్ల ఊపిరితిత్తులు దెబ్బతిని శ్వాసకోశ సంబంధ సమస్యలు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ సదుపాయం ఉండేలా చూడాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆదేశించారు. లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో వైద్య సిబ్బంది, ప్రభుత్వ ప్రైవేట్‌ ఆసుపత్రులు, ప్రజలు తీసు కోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి ఈటల మంగళ వారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాల్లోని మందుల స్టాక్‌పై ఆరా తీశారు. అన్ని ఆసుపత్రుల్లో సరిపడా మందులుం డేలా చూడాలని ఎండీని ఆదేశించారు.

లాక్‌డౌన్‌ సడలింపులతో ప్రజలు పెద్దసంఖ్యలో బయటికి వస్తున్నారని, ఇప్పుడు మరింత అప్రమత్తత అవసరమన్నారు. బయటికొచ్చే వారు తప్పక మాస్క్‌ ధరించాలని, భౌతికదూరం పాటించాలని, తరచుగా చేతులు శుభ్రం చేసుకోవాలని కోరారు. ఇంట్లో చిన్న పిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దగ్గు, జ్వరం లక్షణాలుంటే వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. వలస కార్మికులు, విదేశీ ప్రయాణికులు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారికి, అలాగే కరోనా కట్టడికి ముందుండి పనిచేస్తున్న వైద్య, మున్సిపల్, పోలీసు సిబ్బందికి వ్యాధి లక్షణాలుంటే పరీక్షలు చేయించా లని ఐసీఎంఆర్‌ మార్గనిర్దేశకాలు విడుదల చేసిందన్నారు.

గ్రామాల్లో జ్వర పరీక్షలపై ఆరా..
గతంలోనే చెప్పినట్టు బయటి నుంచి వస్తున్న వారిని 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌ చేయాలని ఈటల మరోసారి ఆదేశించారు. గ్రామాల్లో జ్వర పరీక్షలపై మంత్రి ఆరా తీశారు. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించవద్దని కోరారు. అన్ని ఆసుపత్రుల్లో అన్ని వైద్య సేవలందేలా చూడాలని సూచించారు. కరోనా లక్షణాలున్న వారిని, నాన్‌ కరోనా రోగులను విడివిడిగా చూడాలని కోరారు. గాంధీ ఆసుపత్రిలో రోగుల చికిత్సపై కూడా మంత్రి సమీక్షించారు. గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రాజారావుతో ఫోన్‌లో మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement