మళ్లీ శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి | Electricity generation starts in srisailam | Sakshi
Sakshi News home page

మళ్లీ శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి

Nov 10 2014 6:37 AM | Updated on Sep 27 2018 5:46 PM

శ్రీశైలంలో మళ్లీ విద్యుత్తు ఉత్పత్తి మొదలైంది. రెండు రోజులపాటు ఎడమగట్టున విద్యుదుత్పత్తి కొనసాగింది.

హైదరాబాద్: శ్రీశైలంలో మళ్లీ విద్యుత్తు ఉత్పత్తి మొదలైంది. రెండు రోజులపాటు ఎడమగట్టున విద్యుదుత్పత్తి కొనసాగింది. కృష్ణా బోర్డు నిర్ణయం.. రెండు రాష్ట్రాల వివాదం నేపథ్యంలో అయిదు రోజుల విరామం తర్వాత తెలంగాణ ప్రభుత్వం మళ్లీ ఉత్పత్తి ప్రారంభించటం చర్చనీయాంశంగా మారింది. ఈనెల రెండో తేదీ అర్ధరాత్రి నుంచి టీఎస్‌జెన్‌కో అక్కడ విద్యుత్తు ఉత్పత్తిని నిలిపేసిన విషయం తెలిసిందే. మూడు టీఎంసీల కోటా నిండగానే... విద్యుదుత్పత్తి ఆపేయటంతో తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డు నిర్ణయాన్ని అమలు చేసినట్లు సంకేతాలు జారీ చేసింది.

అయితే, బోర్డు నిర్ణయాన్ని సవాలు చేస్తూ మంత్రి హరీశ్‌రావు ఢిల్లీకి వెళ్లి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అయిదు రోజుల విరామం తర్వాత విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభమైంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 2.81 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసినట్లు టీఎస్ జెన్‌కో తెలిపింది. తక్షణ అవసరాల నిమిత్తం చేయాల్సి వచ్చిందని సంబంధిత అధికారులు అభిప్రాయపడ్డారు. శనివారం మధ్యాహ్నం నుం చి రాత్రి వరకు 120 మెగావాట్ల సామర్ధ్యంతో నాలుగు యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి జరిగింది.

దాదాపు 28 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి 145 మెగావాట్ల సామర్థ్యంతో 3 యూనిట్ల ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేపట్టారు. 21 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఉత్పత్తి జరగలేదని టీఎస్‌జెన్‌కో తెలి పింది. మరోవైపు నాగార్జునసాగర్ నుంచి యథాతథంగా విద్యుత్తు ఉత్పత్తి కొనసాగుతోంది.

శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు అక్కడ 6.22 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి జరిగింది. రెండు చోట్ల ఉత్పత్తి జరిగినా.. రాష్ట్రంలో డిమాండ్ మేరకు విద్యుత్తు అందుబాటులో లేకపోవటంతో లోటు తప్ప లేదు. రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ 134 మిలియన్ యూనిట్లకు చేరింది. దీంతో 7.94 మి.యూ. విద్యుత్తు కొరత నమోదైంది.

Advertisement
 
Advertisement
Advertisement