రాష్ట్రవ్యాప్తంగా రైతులందరికీ ఎలక్ట్రానిక్ పట్టాదారు పాస్ పుస్తకాలను ఏప్రిల్ నుంచి పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రైతులందరికీ ఎలక్ట్రానిక్ పట్టాదారు పాస్ పుస్తకాలను ఏప్రిల్ నుంచి పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ రాష్ట్ర విభజన నేపథ్యంలో జాప్యం జరుగుతూ వచ్చింది. తిరిగి ఈ-పట్టాదార్ పాస్పుస్తకాలను జారీచేయాలని..భూపరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయంలో మీ సేవ అధికారులు, రెవెన్యూ అధికారులతో జరిగిన సమీక్షలో ముఖ్య కమిషనర్ అధర్ సిన్హా సోమవారం నిర్ణయించారు. పాస్ పుస్తకాల ముద్రణకు వెంటనే టెండర్లను పిలవాలని రెవెన్యూ అధికారులను అదేశించారు. కొత్తగా సిద్ధం చేయనున్న పాస్పుస్తకాల్లో పొందుపర్చాల్సిన నూతన అంశాలపై చర్చించారు. ఈ-పట్టాదార్ పాసుపుస్తకాల జారీకి అవసరమైన ఏర్పాట్లను చేసుకోవాలని మీసేవ కేంద్రాల అదనపు డెరైక్టర్ హరితకు సూచించారు.