దుబ్బాక మాయం! | District Reorganization Gazette Notification In Not Placed Dubbak In Siddipet | Sakshi
Sakshi News home page

దుబ్బాక మాయం!

Aug 26 2019 7:23 AM | Updated on Aug 26 2019 7:24 AM

District Reorganization Gazette Notification In Not Placed Dubbak In Siddipet - Sakshi

దుబ్బాక పట్టణం వ్యూ

సాక్షి, దుబ్బాక: జిల్లాల పునర్వ్యస్థీకరణ గెజిట్‌ నోటిఫికేషన్‌లో జిల్లాలోని దుబ్బాక మండలమే లేకపోవడం ప్రజల్లో తీవ్ర గందరగోళాన్ని రేకెత్తించింది. దుబ్బాక మండలంలో దుబ్బాక మున్సిపల్‌తో పాటుగా మొత్తం 30 గ్రామ పంచాయతీలున్నాయి. దీంట్లో మండలంలోని 26 గ్రామాలు రికార్డుల్లో లేవన్న వార్తతో మా గ్రామం ఉందో లేదో అన్న ఆందోళనలో ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, ప్రజలు ఉన్నారు. ‘ఊళ్లకు ఊళ్లు మాయం’ అనే కథనంతో ‘సాక్షి’లో ప్రచురితమవడం దుబ్బాక మండలంలో తీవ్ర సంచలనంగా మారింది. రెవెన్యూ రికార్డుల్లో దుబ్బాక మండలం కూడా మాయమైందని ఉండటం, అందులో 26 గ్రామాలు గల్లంతు కావడంతో అసలు ఏమయిందో అర్థం గాక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రజలు అయోమయం చెందుతున్నారు.

అసలు తమ గ్రామం రికార్డుల్లో ఉందో లేదో తెలుసుకునేందుకు మండలంలోని పలు గ్రామాల వారు రెవెన్యూ కార్యాలయానికి పోతే శని, ఆది వారాలు సెలవుదినాలు కావడంతో ఇంకా గందరగోళం నెలకొంది. అసలు రెవెన్యూ రికార్డుల్లో నుంచి మండలంలోని 26 గ్రామాలు ఎలా మాయం అవుతాయి, అధికారుల తప్పిదమా లేక ఎవరన్నా కావాలని చేశారా..? అన్న అనుమనాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. గజిట్‌లో లేకుంటే మరి పరిస్థితి ఏంటని జనాభా లెక్కల్లో తమ గ్రామాలు, తాము ఎలా గల్లంతయ్యామని కొత్త జనాభా లెక్కల్లో తాము తమ గ్రామాలు ఉంటాయా అన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది.

అసలు ఆ 26 గ్రామాలు ఏవీ?
రెవెన్యూ రికార్డుల్లో మాయమైన దుబ్బాక మండలంలోని 26 గ్రామాలు ఏవో తెలియక ప్రజా ప్రతినిధులు, ప్రజలు అయోమయం చెందుతున్నారు. మండలంలో 30 గ్రామాలుండగా రికార్డుల్లో మాత్రం దుబ్బాక మండలం పేరు గల్లంతు కావడం అందులో 26 గ్రామాలు కనిపించకుండా పోవడంతో తీవ్ర గందరగోళంగా తయారైంది. తమ గ్రామం రికార్డుల్లో ఉందా అని ఎక్కడ తెలుసుకోవాలో తెలియక పలు గ్రామాల నాయకులు అధికారులకు ఫోన్లు చేస్తున్నారు. శని, ఆదివారాలు వరుస సెలవు దినాలు కావడంతో గ్రామాల్లో ఇంకా అయోమయంగా తయారైంది.

మాకేం తెలియదంటున్న రెవెన్యూ అధికారులు
రెవెన్యూ రికార్డుల్లో దుబ్బాక మండలం మాయంపై రెవెన్యూ అధికారులు తమకేం తెలియదంటూ పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. అలా ఎలా జరుగుతుంది, తమ దృష్టికి ఏం రాలేదు అని అర్థం లేని మాటలు చెబుతున్నారు. దుబ్బాక మండలం రికార్డుల్లో అసలు ఉందా లేదా అన్న విషయాన్ని అధికారులు ఫోన్‌లో క్లారిటీగా చెప్పలేకపోతున్నారు. ఉన్నతాధికారులను అడుగుతామని సోమవారం ఆఫీసుకు వచ్చాక తెలుసుకుంటామంటూ విషయంపై క్లారిటీ లేకుండా మాట్లాడుతుండటం చూస్తుంటే ఈ విషయంపై వారికి సరైన అవగాహన లేదన్నట్లు స్పష్టమవుతోంది.

ఉన్నతాధికారులతో మాట్లాడుతా..
రికార్డుల్లో దుబ్బాక మండలం మాయం కావడంపై సంబంధిత రాష్ట్ర ఉన్నతాధికారులతో మాట్లాడుతా. ఇలా జరగడానికి కారణం ఏంటి అనే విషయం పూర్తి స్థాయిలో తెలుసుకుంటా. రెవెన్యూ రికార్డుల్లో మండలంతో పాటు 26 గ్రామాలు లేవన్న విషయం తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. ఖచ్చితంగా దీనిపై క్లారిటీ తీసుకుంటే గాని ఏం జరిగిందనేది తెలుస్తుంది.
– సోలిపేట రామలింగారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే

మా దృష్టికి రాలేదు
రికార్డుల్లో దుబ్బాక మండలం మాయమైందన్న విషయం మా దృష్టికి రాలేదు. దీనిపై ఉన్నతాధికారులను సంప్రదించి తెలుసుకుంటాం. ఇలా జరగడానికి వీలు లేదు. సోమవారం కార్యాలయానికి వచ్చాక క్లారిటీగా ఈ విషయంపై తెలుసుకుంటాం.  – అన్వర్, తహసీల్దార్, దుబ్బాక 

Advertisement
 
Advertisement
Advertisement