పుర నామినేషన్లకు తెర | deadline ended for municipal elections | Sakshi
Sakshi News home page

పుర నామినేషన్లకు తెర

Mar 15 2014 2:01 AM | Updated on Sep 2 2017 4:42 AM

అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీలు, సత్తుపల్లి, మధిర నగర పంచాయతీల్లోని మొత్తం 97 వార్డులకు 925 నామినేషన్లు వేశారు.

సాక్షి, ఖమ్మం: పురపాలక నామినేషన్ల ఘట్టానికి తెర పడింది. అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది.  కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీలు, సత్తుపల్లి, మధిర నగర పంచాయతీల్లోని మొత్తం 97 వార్డులకు 925 నామినేషన్లు వేశారు. చివరి రోజు శుక్రవారం అన్ని పార్టీలు పోటాపోటీగా తమ అభ్యర్థులతో నామినేషన్లు దాఖలు చేయించాయి. అభ్యర్థులు పార్టీల తరఫున నామినేషన్ వేసి నా.. వారికి మాత్రం రెబెల్స్ బెడద తప్పలేదు.

 మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈనెల 10 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా తొలి రెండు రోజులు ఊపందుకోలేదు. పార్టీల మధ్య పొత్తులు కుదరకపోవడం, పలు పార్టీలకు అభ్యర్థులు దొరకక ఈ పరిస్థితి ఏర్పడింది. ఆతర్వాత పొత్తులు, ఒంటరి పోరు విషయంలో పార్టీలు అవగాహనకు రావడంతో చివరి మూడు రోజులు నామినేషన్లు జోరుగా పడ్డాయి. ఇక చివరి రోజు అన్ని పార్టీల నుంచి నామినేషన్లు హోరాహోరీగా దాఖలయ్యాయి. మొత్తంగా... సత్తుపల్లి 20 వార్డులకు 109 నామినేషన్లు, మధిరలో 20 వార్డులకు 115, కొత్తగూడెం మున్సిపాలిటీలో 33 వార్డులకు 307, ఇల్లెందు మున్సిపాలిటీలో 24 వార్డులకు 394 నామినేషన్లు వేశారు. ఇల్లెందు మున్సిపాలిటీ వార్డులకు అత్యధికంగా నామినేషన్లు వచ్చాయి. మధిర నగర పంచాయ తీ చైర్మన్‌పదవి ఎస్సీ మహిళకు రిజర్వు అయిం ది.  అన్ని పార్టీలు చైర్మన్ పీఠం దక్కించుకోవడ మే ధ్యేయంగా ఇక్కడ అభ్యర్థులను బరిలోకి దిం పాయి. పంచాయతీలోని 18వ (ఎస్సీ మహిళ) వార్డుకు అత్యధికంగా 13 నామినేషన్లు దాఖల య్యాయి. కొత్తగూడెంలో 4 వవార్డు (బీసీ జనర ల్)కు 18 నామినేషన్లు వేశారు. సత్తుపల్లిలో 20 వ (జనరల్) వార్డుకు 10 నామినేషన్లు వచ్చాయి.

 ఇల్లెందులో వైరివర్గాలు..
 సత్తుపల్లి, కొత్తగూడెం, మధిర, ఇల్లెందులో వైఎస్సార్‌సీపీ.. సీపీఎం పొత్తుతో అభ్యర్థులను బరిలో నిలిపాయి. సత్తుపల్లి, మధిరలో కాంగ్రెస్, సీపీఐ కలిసి పోటీలో ఉన్నాయి. కొత్తగూడెం, ఇల్లెందులో కాంగ్రెస్, సీపీఐ వేర్వేరుగానే బరిలో తమ అభ్యర్థులను నిలిపాయి. ఇక ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పటి వరకు టీడీపీకి ఒంటరి పోరు తప్పలేదు. ఇల్లెందులో మాత్రం 20 వార్డులకు కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధికంగా 103 నామినేషన్లు వేశారు. కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి వర్గాలు వేర్వేరుగా నామినేషన్లు వేయడంతో ఈ సంఖ్య పెరిగింది. ఒక పార్టీ అభ్యర్థులే వేర్వేరుగా నామినేషన్లు వేసి నువ్వానేనా.. అన్నట్లుగా తలపడుతున్నారు. అలాగే సీపీఎం (ఎంల్) న్యూడెమోక్రసీ చంద్రన్న, రాయలవర్గాలు వేర్వేరుగా నామినేషన్లు వేశాయి.

 అభ్యర్థులకు రె‘బెల్స్’..
 బరిలో నిలవడానికి ఉత్సాహంగా నామినేషన్ వేసినా.. పార్టీ అభ్యర్థులకు మాత్రం రెబెల్స్ బెడద పట్టుకుంది. సుమారు 200మందికి పైగా స్వతంత్రులుగా నామినేషన్ వేశారు. వీరిలో చాలా మంది పార్టీ తరఫున నిలబడే అవకాశం లేకపోవడంతో స్వతంత్రంగా బరిలో నిలవడానికి నామినేషన్ వేశారు. వీరితో విత్‌డ్రా చేసుకునేలా బుజ్జగించకుంటే తమకు ఓటమి తప్పదని.. నామినేషన్ వేసిన అభ్యర్థులు తమ నేతల వద్ద మొర పెట్టుకుంటున్నారు.  

 గత మున్సిపల్ ఎన్నికల్లో రెబెల్స్ పోటీతో పార్టీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులు ఘోర పరాజయం పొందిన సంఘటనలున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీల తరఫున బరిలో దిగిన అభ్యర్థులు రెబెల్స్‌ను బుజ్జగించే దారులు వెతుకుతున్నారు. ఇందుకు సంబంధించి అప్పుడే రాయ‘బేరాలు’కూడా మొదలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement