
సాక్షి,హైదరాబాద్: హరితహారంలో భాగంగా తెలంగాణలో ప్రతీ ఒక్కరూ బాధ్యతగా మొక్కల్ని నాటి వాటిని సంరక్షించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి సూచించారు. నగరానికి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాల్లో ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు అటవీశాఖ అర్బన్ పార్కులను ఏర్పాటు చేస్తోందన్నారు. నగరంలోని గుర్రంగూడ వద్ద ఆరోగ్య సంజీవని వనం పేరిట ఏర్పాటు చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్కును అటవీ శాఖ, రంగారెడ్డి జిల్లా ఉన్నతాధికారులతో కలసి సీఎస్ ఎస్కే జోషి దంపతులు మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా అర్బన్ పార్కుల అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. ఈ పార్కులో వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లను కూడా ఏర్పాటు చేశారు. అంతకు ముందు ఐదో విడత హరితహారంపై సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ వీడియో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, అటవీ అభివృద్ధి్ద కార్పొరేషన్ ఎం.డి. రఘువీర్, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. హరీశ్, అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.